న్యూస్ నెట్వర్క్ నమస్తే తెలంగాణ, నవంబర్ 9: ఆర్ఎఫ్సీఎల్ను జాతికి అంకితం చేసేందుకు రామగుండం పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నిరసన సెగలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభమైన కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివిధ కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు నేటి నుంచి ఉద్ధృతంగా నిరసన తెలుపాలని నిర్ణయించాయి.
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘమైన టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో 10న అన్ని గనులు, డిపార్ట్మెంట్ల కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపాలని నిర్ణయించినట్టు టీబీజీకేఎస్ ఆర్జీ-1 ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్రావు తెలిపారు. 11న సాయంత్రం గోదావరిఖని టీబీజీకేఎస్ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ చేపడుతామని చెప్పారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నేడు గనులపై నల్లబ్యాడ్జీలతో నిరసన, 11న గోదావరిఖని అంగడి బజార్ నుంచి చౌరస్తా వరకు ర్యాలీ, 12న గోదావరిఖనిలో అన్ని వర్గాల ప్రజలు నల్ల బ్యాడ్జీలతో ‘మోదీ గో బ్యాక్’ అంటూ నిరసనలు ఉంటాయని ఏఐటీయూసీ ప్రధానకార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు.
ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నేడు బొగ్గు గనులపై నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం ఉంటుందని ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి జనక్ప్రసాద్ తెలిపారు. సీఐటీయూతో పాటు ఏఐఎస్ఎఫ్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఇతర విప్లవ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు ఉంటాయని పేర్కొన్నారు. 12న ప్రధాని పర్యటనను అడ్డుకునేందుకు కమ్యూనిస్టులు, కార్మిక శ్రేణులు తరలిరావాలని సీపీఐ నేతలు పిలుపునిచ్చారు. తెలంగాణలో చిచ్చుపెట్టేందుకు వస్తున్న ప్రధాని మోదీని అడ్డుకుంటామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు పేర్కొన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాలలోని హమాలీ యూనియన్ కార్యాలయం నుంచి సీసీసీ కార్నర్ వరకు ర్యాలీ జరిపారు.
ఎస్సీ వర్గీకరణ చేయని మోదీ అడుగు పెట్టొద్దు..
ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని లెక్క చేయని మోదీ రాష్ట్రంలో అడుగుపెట్టొద్దని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాదాసు థామస్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చే ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను మోదీ విస్మరించారని, ఆయన ప్రభభుత్వం వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని దుయ్యబట్టారు.