Minister KTR | బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ అనేది కేంద్రం విభజన చట్టంలో ఇచ్చిన హామీ. అటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కడపలోనూ ఉక్కుఫ్యాక్టరీ పెడుతామని ప్రకటించింది. కానీ బయ్యారంపై కేంద్రం చేతులెత్తేసింది. కడపలోనూ ఆ హామీని అటకెక్కించింది. సరిహద్దుల్లో విస్తారమైన ముడి ఇనుము ఉన్నా ఇటు బయ్యారంలోనూ, అటు కడపలోనూ ఉక్కుఫ్యాక్టరీ పెట్టకపోగా.. ఆంధ్రలో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించేందుకు కేంద్రం సిద్ధమైంది. దీని మతలబేమిటి? ఎవరి కోసం బయ్యారాన్ని బలిపెట్టారు? ఎవరి కోసం విశాఖ ఉక్కుకు ఉరివేసేందుకు సిద్ధమవుతున్నారు? ఈ కుట్రను మంత్రి కేటీఆర్ బట్టబయలు చేశారు.
బయ్యారం ఫ్యాక్టరీ కోసం 2014 నుంచి కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నాం. సీఎం కేసీఆర్ ప్రధానిని కలిసి విన్నవించారు.
బయ్యారంలో ఫ్యాక్టరీ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని ఉక్కుశాఖ మంత్రి బీరేంద్ర చౌదరి హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పారు.
జూన్ 2018లో నేను స్వయంగా ప్రధాని మోదీని కలిసినప్పుడు బైలాడిలా నుంచి బయ్యారం వరకు స్లర్రీ పైప్లైన్ వేసి ఖనిజాన్ని తీసుకురావచ్చని చెప్పాను. అందుకయ్యే ఖర్చులో 50% రాష్ట్రం భరిస్తుందని తెలిపాను. అయితే తెరవెనుక కుట్రను అర్థం చేసుకోలేకపోయాం.
కేంద్రమంత్రి కిషన్రెడ్డి బయ్యారంలో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని ప్రకటించడం వెనుక అదానీకి బైలాడిలా గనుల్ని కేటాయించడమే కారణం. గనులివ్వక, ఐరన్ ఓర్ కేటాయించక విశాఖ ఉక్కు ను నష్టాల్లోకి నెట్టేశారు.
2018 ఏప్రిల్లో బైలాడిలా ఐరన్ ఓర్ను జపాన్కు చెందిన స్టీల్ మిల్స్, కొరియాకు చెందిన పాస్కో కంపెనీకి కేంద్రం కేటాయించింది.
2018 సెప్టెంబర్లో బైలాడిలా ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని అదానీ ప్రారంభించారు.
పాస్కో కంపెనీతో అదానీ గ్రూప్ జాయింట్ వెంచర్ ఏర్పాటుచేసింది.
ఈ రెండు కలిసి గుజరాత్లోని ముంద్రాలో రూ.40 వేల కోట్ల పెట్టుబడితో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు స్వయంగా అదానీయే ప్రకటన చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): అదానీ గ్రూప్కు కేటాయించిన ఛత్తీస్గఢ్- ఒడిశాలోని బైలాడిలా ఇనుప గనుల లైసెన్సులను వెంటనే రద్దుచేసి, వాటిని బయ్యారం, విశాఖ ఉక్కు పరిశ్రమలకు కేటాయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బయ్యారం, విశాఖ ఉక్కు పరిశ్రమల పొట్టకొడుతున్నది ప్రధాని, అదానీలేనని ఆరోపించారు. అదానీ కంపెనీకి బైలాడిలా ఐరన్ ఓర్ కేటాయించడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, దానం నాగేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ టీ భానుప్రసాద్రావు, ఎమ్మెల్సీ టీ రవీందర్రావు, టీఆర్ఎస్ నాయకులు ఎం శ్రీనివాస్రెడ్డి, బండి రమేశ్, దాసోజు శ్రవణ్కుమార్తో కలిసి కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖ ఉక్కు పరిశ్రమ వేలం బిడ్లో పాల్గొనే అంశంపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి సీఎం కేసీఆర్ ఆదేశాలతో సింగరేణి అధికారులు విశాఖపట్నం వెళ్లారని తెలిపారు. అధ్యయనం తరువాత బిడ్లో పాల్గొనే అంశంపై నిర్ణయం తీసుకొంటామని చెప్పారు.
ప్రభుత్వరంగ సంస్థలను కాపాడాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ మొదటినుంచీ చెప్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఇందులో భాగంగానే విశాఖ ఉక్కు పరిశ్రమ వేలం బిడ్లో పాల్గొనే అంశంపై అధ్యయనం చేయాలని సూచించారని చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడటం వల్ల ఉద్యోగుల నియమాకాల్లో రిజర్వేషన్లు పొందే అవకాశం ఉంటుందని అన్నారు. విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణ పనులను ప్రైవేటు సంస్థలకు ఇచ్చే అవకాశం ఉన్నా, తాము ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈఎల్కు ఆర్డర్లు ఇచ్చామని.. రైతు బీమా, నేతన్న బీమా వంటి పథకాల ఇన్సూరెన్స్ బాధ్యతను కూడా ఎల్ఐసీకి అప్పగించామని గుర్తుచేశారు. ప్రభుత్వరంగ సంస్థల పట్ల తన నిబద్ధతను మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా చూపించిన నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. సోషలైజేషన్ ఆఫ్ లాసెస్, ప్రైవేటైజింగ్ ఆఫ్ ప్రాఫిట్స్ అనే విధంగా కేంద్రం వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ నష్టాలను జాతికి అంకితం చేస్తూ.. లాభాలను ప్రైవేటు దోస్తులకు పంచిపెడుతున్నారని విమర్శించారు. ‘విశాఖ ఉకు విషయంలో చూపిస్తున్న ఉత్సాహం.. బయ్యారం విషయంలో ఎందుకు చూపటంలేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నట్టుగా పత్రికల్లో చూశా. ఆయనకేమో విషయ పరిజ్ఞానం లేదు. ఆయన ఒక ఆజ్ఞాని. ఆయనకు చెబితే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ. ఆయన ఒక విచిత్రమైన మనిషి. ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎలా మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడుతాడో అర్థం కాదు. ఆయనకు వచ్చిన సందేహం మరెవరికీ రావొద్దనే ఉద్దేశంతో దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని నిర్ణయించాం’ అని తెలిపారు.
విశాఖ ఉకుకు, బయ్యారం స్టీల్ ప్లాంట్కు మధ్య ఉన్న ముఖ్యమైన సంబంధం బైలాడిలాలోని ఇనుప గనులేనని మంత్రి కేటీఆర్ తెలిపారు. అక్కడ రూ.6 లక్షల కోట్ల విలువైన 134 కోట్ల టన్నుల ఐరన్ ఓర్ నిల్వలున్నాయని చెప్పారు. ‘బయ్యారానికి బైలాడిలా 150-160 కిలోమీటర్ల దూరంలో, వైజాగ్ నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. బైలాడిలాలో నాణ్యమైన ఐరన్ ఓర్ ఉన్నదని కేంద్ర ప్రభుత్వ సంస్థలే తేల్చాయి. తెలంగాణలోని బయ్యారంలో, ఆంధ్రప్రదేశ్లోని కడపలో ఉకు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కేంద్రం స్పష్టంగా హామీ ఇచ్చింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా స్టీల్ ప్లాంట్ పెట్టే అవకాశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. బయ్యారం ప్లాంటుకోసం 2014 నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాం. దీని గురించి సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధానమంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. లేఖలు రాశారు. పరిశ్రమల శాఖ మంత్రిగా నేను కూడా అనేకమార్లు కేంద్ర మంత్రులను, అధికారులను కలిశా. నాటి ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర చౌదరి జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) 50వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చినప్పుడు బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఎందుకు ఏర్పాటు చేస్తలేరని అడిగితే.. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని, కానీ కొత్తగూడెంలో ఒక ప్లాంట్ పెడదాం. ఇంకో దగ్గర ఇంకో పరిశ్రమ పెడదామని చెప్పుకొచ్చారు. జూన్ 2018లో నేను స్వయంగా ప్రధాని మోదీని కలిసి బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై మిమ్ముల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించాను. బైలాడిలా నుంచి బయ్యారం వరకు స్లర్రీ పైప్లైన్ వేసి ఖనిజాన్ని తీసుకురావచ్చని చెప్పాను. స్లర్రీ పైప్లైన్ వేయడానికి అయ్యే ఖర్చులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపాను. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ద్వారా స్థానిక గిరిజనుల్లో 15 వేల నుంచి 20 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని, రాష్ట్రానికి ఆదాయం కూడా వస్తుందని వివరించాను. వెనకబడిన ప్రాంతానికి పరిశ్రమ వస్తుందని, అదే సమయంలో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు అవుతుందని తెలిపాను. అయితే తెరవెనుక జరుగుతున్న కుట్రను మేము ఆనాడు అర్థం చేసుకోలేకపోయాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
బయ్యారం నుంచి బైలాడిలా150-160 కిలోమీటర్లు.. బైలాడిల్లా నుంచి వైజాగ్కు 600 కిలోమీటర్లు. అదే గుజరాత్లోని ముంద్రాకు 1,800 కిలోమీటర్లు. 150, 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయ్యారం, విశాఖలకు ఫీజిబుల్ కాదు కానీ.. 1,800 కిలోమీటర్లు తీసుకెళ్తే ఎట్లా ఫీజిబుల్ అయితది అని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ‘ఇకడ ఉండే అజ్ఞాన బీజేపీ నేతలు అర్థం చేసుకోకపోవచ్చు.. అర్థమైనా అదానీ కోసం వారు నోరు మూసుకోవచ్చు. ఎందుకంటే వీళ్లు అజ్ఞానులు.. ఆయన అదానీ.. ఇది డెడ్లీ కాంబినేషన్. వీళ్లు అర్థం చేసుకోకపోయినా తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో వివరిస్తున్నాం. వైజాగ్ స్టీల్ పొట్టకొడుతున్నది ప్రధాని, అదానీ. బయ్యారంను ఎండబెడుతున్నది కూడా ప్రధాని, ఆదానీయే. ఇకడ ఉండే అజ్ఞానికి, ఆ అదానీకి ఉన్న సంబంధం మాకు అవసరం లేదు. కానీ ప్రధాని, అదానీ కలిసి తెలుగు రాష్ట్రాల ప్రజల సంపద కొల్లగొడుతున్న మాట వాస్తవం. ఇది నిర్దిష్టమైన ఆధారాలతో చేస్తున్న ఆరోపణ. నేను చెప్పిన మాట తప్పయితే పరువు నష్టం దావా వేయండి’ అని బీజేపీ నేతలకు కేటీఆర్ సవాల్ విసిరారు.
కుక్కను చంపాలంటే అది పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి అనేలా తెరవెనుక పాత్రదారులు, సూత్రదారులు కదిలారని మంత్రి కేటీఆర్ అన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమకు అవసరమైన ఐరన్ ఓర్ను బైలాడిలా నుంచి కేటాయించాలని కోరుతున్న సమయంలోనే అదానీ ఎంటర్ అయ్యారని కేటీఆర్ తెలిపారు. ‘2018 సెప్టెంబర్లో బైలాడిలా ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని అదానీ ప్రారంభించారు. 2018 ఏప్రిల్లో బైలాడిలా ఐరన్ ఓర్ను జపాన్కు చెందిన స్టీల్ మిల్స్, కొరియాకు చెందిన పాస్కో కంపెనీకి కేంద్రం కేటాయించింది. పాస్కో కంపెనీతో అదానీ గ్రూప్ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. ఈ రెండు కలిసి గుజరాత్లోని ముంద్రా లో రూ.40 వేల కోట్ల పెట్టుబడితో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు అదానీయే ప్రకటన చేశారు. ఈ క్రమంలో పాస్కో కంపెనీ వైజాగ్లో స్టీల్ ప్లాంట్ పెడుతుందా? అని ఆంధ్రప్రదేశ్ ఎంపీ విజయసాయిరెడ్డి 2021 అక్టోబర్లో పార్లమెంట్లో ఒక ప్రశ్న అడిగారు. దానికి పాస్కో కంపెనీ ఆలోచన చేస్తుందని కేంద్రం సమాధానమిచ్చింది. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టకపోవడానికి కారణం బైలాడిలా ఐరన్ ఓర్ను అదానీ కంపెనీకి కేటాయించడమే. కేంద్రమంత్రి కిషన్రెడ్డి కూడా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదని ప్రకటించారు. కారణం.. అదానీకి బైలాడిలా ఐరన్ ఓర్ను కేటాయించడమే. గనులు ఇవ్వక, ఐరన్ ఓర్ను కేటాయించక విశాఖ ఉక్కు పరిశ్రమను నష్టాల్లోకి నెట్టివేశారు’ అని మండిపడ్డారు.