అశ్వారావుపేట, జనవరి 3: సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక ఆలతో కలిసి భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి సమీపంలోని ప్రాజెక్ట్ 4వ పంప్హౌజ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులకు పలు అంశాలపై సూచనలు చేశారు.
నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేసి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణం అంచనా రూ.13,500 కోట్లు కాగా.. ఇప్పటివరకు రూ.7 వేల కోట్లు ఖర్చు చేసినట్టు మంత్రికి ఇరిగేషన్ సీఈ శ్రీనివాసరెడ్డి వివరించారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. యాతాలకుంట టన్నెల్ పనులు పూర్తయితే సత్తుపల్లి ట్రంక్, లంకాసాగర్ ప్రాజెక్టుకు నీరు అందే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ ఏడాది వర్షాకాలం నాటికి వైరా రిజర్వాయర్ ఆయకట్టుకు గోదావరి జలాలను అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తయితే మొత్తం 6.74 లక్షల ఎకరాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందుతుందని తుమ్మల వెల్లడించారు. మంత్రి వెంట ఇరిగేషన్ ఎస్ఈలు వెంకటేశ్వర్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఈఈలు అర్జున్, శ్రీనివాస్, సురేశ్ తదితరులు ఉన్నారు.