హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో పరిస్థితులపై వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ఎన్ఎంసీ తనిఖీల నాటికి సిద్ధమయ్యే పరిస్థితులు లేకపోవడంపై నమస్తే తెలంగాణ గురువారం ‘మెడికల్ కాలేజీలకు గుర్తింపు గండం’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. దీంతో ఈ అంశంపై సీఎం రేవంత్రెడ్డి స్పందించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి కార్యాలయం సూచన మేరకు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం మెడికల్ కాలేజీలపై సమీక్ష నిర్వహించారు. హెల్త్ సెక్రటరీ, ఇద్దరు డీఎంఈలను పిలిపించుకొని కాలేజీల్లో పరిస్థితులపై ఆరా తీశారు. ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఏయే కాలేజీలకు ఎన్ఎంసీ నుంచి నోటీసులు వచ్చాయి? వాటికి ఎలాంటి రిైప్లె ఇచ్చారు? ఎన్ఎంసీ తనిఖీలు ఎప్పుడు మొదలవుతాయి?, ఎలాంటి వసతులు కల్పించాలి? వంటి వివరాలపై చర్చించారు. ప్రస్తుత పరిస్తితులు ఇలాగే కొనసాగితే ఈ దఫా 20-30 శాతం మెడికల్ సీట్లలో కోత పడే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపినట్టు సమాచారం. దీంతో ఆ అవకాశం ఇవ్వకుండా చేపట్టాల్సిన చర్యలను వెంటనే అమల్లోకి తేవాలని మంత్రి అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.