హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): కోటి వృక్షార్చనలో లక్ష్యానికి మించి మొక్కలు నాటి విజయవంతం చేశారని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అభినందించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో కోటికి మించి మొక్కలు నాటినట్టు వివరించారు. వివిధ సంక్షేమ పథకాల పురోగతిని సీఎస్ సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
హరితహారం కింద, దశాబ్ది సంపద వనాల కింద నిర్ధారిత లక్ష్యాలను పూర్తిచేయాలని ఆదేశించారు. హరితహారం ప్లాంటేషన్ను సెప్టెంబర్ రెండో వారంలోగా పూర్తి చేయాలని చెప్పారు. నోటరీ స్థలాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే విచారించి పూర్తిచేయాలని తెలిపారు. వివిధ జిల్లాల్లో చేపట్టాల్సిన కారుణ్య నియామకాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.