రాష్ట్రంలో ఇంకా ఎక్కడైనా రెవెన్యూ సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే నిర్దిష్టమైన ఆదేశాలను కలెక్టర్లకు ఇస్తాం. ఇప్పటికే మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి తదితరుల నేతృత్వంలోని కమిటీ రెవెన్యూ సమస్యలపై అధ్యయనం చేసింది. 98 శాతం రెవెన్యూ సమస్యలు ధరణి రావడంతో పరిష్కారమయ్యాయి. – సీఎం కేసీఆర్
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): త్వరలోనే నియోజకవర్గాలవారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. మంగళవారం తెలంగాణభవన్లో టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో 98% రెవెన్యూ సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. అతి త్వరలోనే తాను జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నానని, దీనికి ముందే రాష్ట్ర మంత్రిమండలి సమావేశాన్ని కూడా ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇంకా ఎక్కడైనా రెవెన్యూ సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే నిర్దిష్టమైన ఆదేశాలను కలెక్టర్లకు ఇస్తామన్నారు. ఇప్పటికే మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి తదితరుల నేతృత్వంలోని కమిటీ రెవెన్యూ సమస్యలపై అధ్యయనం చేసిందని, 98 శాతం రెవెన్యూ సమస్యలు ధరణి రావడంతో పరిష్కారమయ్యాయని అన్నా రు.
తెలంగాణ సమాజంలో ధరణి ఒక గుణాత్మకమైన మార్పు తెచ్చిందన్నారు. లక్షా 55వేల ఎకరాల భూమి ధరణిలోకి వచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని చూసి దేశంలోని రైతు సంఘాల నేతలే ఆశ్చర్యపోయారని, ఎలాంటి సమస్యలు లేని భూరికార్డుల నిర్వహణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉన్నదని చెప్పారని గుర్తు చేశారు. ఇంకా అక్కడక్కడ మిగిలిపోయిన రెవెన్యూ సం బంధ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తామని తెలిపారు. ఎమ్మెల్యేలు వీటిని పకడ్బందీగా నిర్వహించుకోవాలని, ప్రతి నియోజకవర్గంలో పెట్టించేలా చొరవ తీసుకోవాలని, అక్కడికక్కడ సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. ఇటీవల రాహుల్గాంధీ వచ్చి ధరణి గురించి ఏవో చెత్త మాటలు మాట్లాడారని, కానీ, అమెరికా, ఇంగ్లండ్ తదితర దేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు కూడా ధరణిని మెచ్చుకొన్నారని, దేశంలోని అనేక రాష్ట్రాల రైతులు ఈ వ్యవస్థను చూసి సంబురపడ్డారని సీఎం గుర్తు చేశారు.
సొంత జాగలో ఇండ్లకు మూడు లక్షలు..
రాష్ట్రంలో సొంత జాగలో ఇండ్లు కట్టుకునేవారికి నిధులు ఇవ్వాలని నిర్ణయించామని, దీనికి సంబంధించి విధివిధానాలను త్వరలోనే ఇస్తామని సీఎం తెలిపారు. జిల్లా మంత్రులకు దీనిపై అధికారాలు ఉంటాయన్నారు. మంత్రులతో ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకొని లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పారు.
పోడు భూముల సమస్య తీరినట్టే..
రాష్ట్రంలోని 3-4 జిల్లాల్లో పోడు భూముల సమస్య ఉన్నదని, దీనిపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నదని సీఎం కేసీఆర్ చెప్పారు. పదకొండున్నర లక్షల ఎకరాలకు సంబంధించి సమస్య పరిష్కారమైందని, త్వరలోనే ఉత్తర్వులు వస్తాయన్నారు. పోడుకు సంబంధించి ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్న అన్ని పార్టీలను, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేస్తూ సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు. అడవుల రక్షణ కూడా అత్యంత ముఖ్యమైనదని, అడవులను కాపాడుకోవడంపై కూడా ప్రజలను చైతన్యం చేయాలని సీఎం సూచించారు.