సీన్ 1: పెట్టుబడి వ్యయం పెరిగి, సాగునీటి సదుపాయం లేకపోవడంతో దేశంలో ప్రతీరోజు దాదాపు 2 వేలమంది వ్యవసాయరంగాన్ని విడిచిపెట్టి, ఇతర రంగాల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. సాగును విడిచిపెట్టలేక, అప్పుల బాధ తట్టుకోలేక.. ప్రతీ 45 నిమిషాలకు ఒకరి చొప్పున ఉరికొయ్యకు వేలాడుతున్నారు. ఇదీ తొమ్మిదేండ్ల హయాంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు సాధించిన ఘనత.
సీన్ 2: స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏండ్లలో దేశవ్యాప్తంగా పెరిగిన మొత్తం సాగు విస్తీర్ణం కేవలం 6.7 శాతం. అదే సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఏడేండ్లలో సాగు విస్తీర్ణం ఏకంగా 117 % పెరిగింది. అలా రాష్ట్రంలో దినాం సాగు సంబురంగా మారి దేశానికే తెలంగాణ అన్నపూర్ణగా మారింది. అందుకే, పక్కరాష్ర్టాల వాళ్లూ ఇక్కడికి వలస వస్తున్నారు. ఉపాధి పొందుతున్నారు.
Transforming India | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ గప్పాలు కొట్టిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ హామీని గాలికొదిలేశారు. రైతులపై కత్తిగట్టి 3 సాగు చట్టాలు తీసుకొచ్చి 750 మందిని బలిగొన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టాలంటూ హడావుడి చేశారు. ఇలా 2014లో కేంద్రంలో అధికారం చేపట్టింది మొదలు.. బీజేపీహయాంలో అన్నదాతలకు అనుదినం కడగండ్లే మిగిలాయి. దేశంలోని 70 శాతం మంది జనాభాకు వ్యవసాయమే జీవనాధారం. అలాంటి సాగును విడిచిపెట్టి 70 శాతం మంది సన్నకారు రైతులు ఇప్పుడు రోడ్లు, భవన నిర్మాణం, దినసరి కూలీ, ఉపాధి హామీ పథకం వంటి పనులకు పరిమితం అవుతున్నారు. ఈ మేరకు ట్రాన్స్ఫార్మింగ్ రూరల్ ఇండియా ఫౌండేషన్ ఓ సర్వేలో వెల్లడించింది. దేశంలోని 20 రాష్ర్టాల్లో ఈ సర్వేను చేపట్టినట్టు తెలిపింది.
పంటకు పెట్టుబడి వ్యయం అంతకంతకూ పెరిగిపోతుండటం, పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడం, రవాణా, ఎరువులు, కూలీల ఖర్చు పెరిగిపోవడం, మార్కెట్ యార్డుల్లోకి తీసుకుపోయిన ధాన్యానికి మద్దతు ధర లభించికపోవడం, మొత్తం పంటను కొనేవారు లేకపోవడం, అన్నింటికి మించి సాగుకు అవసరమైన నీటి సదుపాయం ప్రభుత్వాలు కల్పించకపోవడం.. వెరసి సన్నకారు రైతన్నకు వ్యవసాయం గుదిబండలా తయారవుతున్నట్టు సర్వే అభిప్రాయపడింది. ఆదుకోవలసిన ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోవట్లేదని, ఫలితంగా వ్యవసాయాన్ని విడిచిపెట్టి వేలాది మంది రైతులు కూలీలుగా మారుతున్నట్టు నిపుణులు చెప్తున్నారు. నివేదికల ప్రకారం.. ప్రతీరోజు సగటున రెండు వేలమంది రైతులు వ్యవసాయాన్ని వదిలి ఇతర రంగాలకు మళ్లుతున్నట్టు సమాచారం.
సాగుకు ప్రాధాన్యం, ప్రాజెక్టుల నిర్మాణం అన్నింటికీ మించి అన్నదాతకు కష్టాన్ని దూ రం చేయాలన్న అకుంఠిత దీక్ష వెరసి తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికే అ న్నపూర్ణగా మారింది. 2014-15లో 62.48 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా, 2020 -21కి అది 1.35 కోట్ల ఎకరాలకు పెరిగింది. అంటే ఏడేండ్లలోనే 117 శాతం సాగు విస్తీర్ణం పెరిగింది. 75 ఏండ్లలో దేశవ్యాప్తంగా నమోదైన సాగు వృద్ధి 6.7 శాతానికే పరిమితమవ్వ డం గమనార్హం. కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు మిషన్ కాకతీయ పథకం ద్వారా రూ.5,349 కోట్లతో రాష్ట్రంలోని 27 వేల చెరువులు, కుంటలను ప్రభుత్వం బాగుచేసింది. 24 గంటల నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా అందిస్తున్నది. దీంతో ధాన్యం దిగుబడి కూడా అనూహ్యంగా పెరుగుతున్నది. తద్వారా రైతులకు, వ్యవసాయ కూలీలకు చేతినిండా పని లభిస్తున్నది. రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల ఉత్పత్తుల ఎగుమతులు కూడా ఏటేటా పెరుగుతున్నాయి. 2014-15తో పోలిస్తే, రెట్టింయ్యి గత ఆర్థిక సంవత్సరంలో రూ. 7,737 కోట్లకు చేరాయి.
సమైక్య పాలనలో వలసబాట పట్టిన తెలంగాణ ఇప్పుడు వలస కూలీలకే ఉపాధి కల్పిస్తున్నది. ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు, కార్మికులు, ఉద్యోగులు తెలంగాణకు వరుస కడుతున్నారు. అంతేకాదు, వలసవచ్చిన వారి ఆదాయ వృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. ఈ మేరకు జాతీయ నమూనా సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్వో) ఇటీవలే వెల్లడించింది.