హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రతి వెయ్యిమంది విద్యార్థుల్లో ఒకరు ఏదో ఒక వైకల్యం బారిన పడుతున్నట్టు పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యింది. వీరిలో అత్యధికులు బుద్ధిమాంద్యంతో ఇబ్బంది పడుతున్నట్టుగా తేలింది. రాష్ట్రంలో మొత్తంగా 54,362 మంది పిల్లలు వైకల్యం బారిన పడ్డట్టుగా ఈ సర్వేలో తేలింది. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలతో పోల్చితే దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనే వైకల్యం కలిగిన విద్యార్థులు అధికంగా ఉన్నట్టు విద్యాశాఖ తేల్చింది. కేంద్ర విద్యాశాఖ ఆదేశాలతో పాఠశాల విద్యాశాఖ అధికారులు రాష్ట్రంలోని ప్రత్యేకావసరాలు గల పిల్లలపై సర్వేను నిర్వహించారు. మొత్తం రెండుసార్లు నిర్వహించిన ఈ సర్వే వివరాలను కేంద్ర విద్యాశాఖ అధికారులకు పంపించారు.
భౌగోళికంగా తీసుకుంటే ఉత్తర తెలంగాణతో పోల్చితే దక్షిణ తెలంగాణ జిల్లాల్ల్లోనే వైకల్యం గల పిల్లలు అధికంగా ఉన్నారు. రాష్ట్రం యూనిట్గా తీసుకుంటే వైకల్యం గల అత్యధిక పిల్లలున్న జిల్లాల్లో టాప్-3 జిల్లాలు దక్షిణ తెలంగాణవి, తక్కువ పిల్లలున్న టాప్ -3 జిల్లాలు ఉత్తర తెలంగాణవి కావడం గమనార్హం. మొత్తం 54,362 మంది వైకల్యం గల విద్యార్థుల్లో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో 35,162 మంది ఉండగా, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 19,200 మంది విద్యార్థులు ఉన్నారు.
వైకల్యం గల పిల్లలు ఏండ్లు గడిచినా పసిపిల్లలతోనే సమానం. వీరు స్వతహాగా తినలేరు. తాగలేరు. ఆడుకోలేరు. అంగవైకల్యం గల పిల్లలుంటే తల్లిదండ్రులు, కుటుంబం ఇబ్బందులు పడతారు. అదే మానసిక వికలాంగులుంటే వారు పడే క్షోభ వర్ణనాతీతం. ఇలాంటి పిల్లలు తల్లిదండ్రులకు భారంగా మారుతారు. ఈ లోపాలను తొలిదశలోనే గుర్తించి సరైన శిక్షణ అందించడమే ఏకైకమార్గం. వీరిలో కండరాల బలహీనత ఉన్నవారు అస్సలు కదలలేరు. మరికొందరు భాషాపరమైన సమస్యలు, సామాజిక అవగాహనా లోపం, ఆలోచనా, ప్రవర్తనా లోపాలతో సతమవుతుంటారు. డాక్టర్లు, మందులు వీరికి పనిచేయవు. కేవలం క్రమబద్ధమైన శిక్షణ మాత్రమే వీరి లోపాలను సవరించగలదు.
ప్రత్యేక అవసరాలున్న పిల్లలను 21 రకాలుగా పేర్కొనవచ్చు. అవి.. అంధులు (పూర్తిగా, స్వల్పంగా అంధత్వం గలవారు), శ్రవణ వైకల్యం (వినికిడి లోపం), కుష్టువ్యాధిగ్రస్తులు, చలన వైకల్యం, మరుగుజ్జుతనం, మేధోవైకల్యం, మానసిక అనారోగ్యం, ఆటిజం, మస్తిష్క పక్షవాతం, కండరాల బలహీనత, దీర్ఘకాలిక కండరాల బలహీనత, నాడీవ్యవస్థ బలహీనత, వాక్కు, భాషావైకల్యం, తలసేమియా, హేమోఫిలియా, పార్కిన్సన్ డిసీజ్, డౌన్ సిండ్రోమ్ మొదలైనవి.