హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతకాలం 111 జీవోకు తూట్లు పొడిచిందని, ఆ జీవో పరిధిలో అడుగడుగునా భూకబ్జాలు జరిగాయని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. 111 జీవో పరిధిలో లక్షల మంది పేద, మధ్య తరగతి ప్రజలు ఉన్నారని, వారందరికీ న్యాయం చేసేందుకే సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆ జీవోను ఎత్తివేశారని తెలిపారు. మంగళవారం ఆయన హైదరాబాద్లోని తెలంగాణ టూరిజం కార్పొరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్రెడ్డి మొదలుకొని కిరణ్కుమార్రెడ్డి వరకూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 111 జీవో పరిధిలో భారీగా అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లు వెలిశాయని నిప్పులు చెరిగారు.
ఈ వాస్తవాలను పక్కనపెట్టి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రాజకీయ దురుద్దేశంతోనే సీఎం కేసీఆర్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దళారులు, బడా వ్యాపారస్తులకు అక్రమంగా భూములను దోచిపెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. డబ్బు కోసం ఆశపడే పార్టీ కాంగ్రెస్ అని, ప్రజల కోసం ఆరాటపడే పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు. 111 జీవో పరిధిలో రేవంత్రెడ్డి అనుచరులు, బంధువులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటికీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ లబ్ధిపొందుతున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ ముఖచిత్రాన్నే మార్చేసిందని, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిందని పేర్కొన్నారు. రేవంత్రెడ్డి ఇకనైనా కండ్లు తెరిచి, నిజాలను చూడాలని హితబోధ చేశారు. తానో పీసీసీ అధ్యక్షుడినని గుర్తు చేసుకుని, చిల్లర మల్లర మాటలకు స్వస్తి పలకాలని సూచించారు. లేకుంటే ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబడక తప్పదని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.