హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేకే కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు ఆది నుంచీ అక్కసు వెళ్లగక్కుతున్నాయని, అసత్య ప్రచారాలు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర నీటి వనరుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వీ ప్రకాశ్ మండిపడ్డారు. కేసీఆర్కు ఉన్న ప్రజాదరణను ఓర్వలేక ప్రాజెక్టును కుట్రపూరితంగా ప్రజల్లో అభాసుపాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కాళేశ్వరం ఫలితాలు అనుభవంలోకి వస్తున్నాయని, అందుకు రాష్ట్రంలో పెరుగుతున్న ధాన్యం దిగుబడులే నిదర్శనమని ఉదహరించారు. వాస్తవాలను పక్కదోవ పట్టించేందుకే కాళేశ్వరం ప్రాజెక్టుపై, కేసీఆర్పై ప్రతిపక్షాలు ఆరోపణలకు దిగుతున్నాయని ధ్వజమెత్తారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా గోదావరి బేసిన్లోని ఏడు రాష్ర్టాల్లో అసాధారణ వర్షపాతం నమోదవ్వడం, ఏకకాలంలో నదులు, వాగులు పొంగిపొర్లడం, ఊహించని వరదల వల్లే పంప్హౌస్లు మునిగిపోయాయని వివరించారు. గతంలో శ్రీశైలం, కల్వకుర్తిలో పంపులు మునిగిన విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలుసుకోవాలని ఎద్దేవాచేశారు. ముంపు వల్ల పంప్హౌస్లకు వందల, వేలకోట్ల నష్టమేమీ జరగలేదని, మోటర్లను సర్వీసు చేస్తే మళ్లీ యథావిధిగా రన్ అవుతాయని వివరించారు. ప్రభుత్వ ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రేవంత్రెడ్డి వెంట నే ఆయనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ఖండన
రేవంత్రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని పెంటారెడ్డికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పెంటారెడ్డి ఉద్యోగ జీవితామంతా జల విద్యుత్తు ప్రాజెక్టుల్లో కొనసాగిందని, తెలంగాణలో ఆయన మాదిరిగా విషయ పరిజ్ఞానం, విశేష అనుభవం ఉన్నవారు లేరని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు, ఆ తరువాత కూడా రాష్ట్రంలో చేపట్టిన అనేక ఎత్తిపోతలకు పెంటారెడ్డి అనుభవం ఉపయోగపడిందని తెలిపారు. దక్షిణాసియాలోనే మొదటి అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం ఆయన ఆధ్వర్యంలోనే పూర్తయిందని, అది విజయవంతమైన తరువాతే తెలంగాణలో చాలా ఎత్తిపోతల పథకాలను చేపట్టారని గుర్తుచేశారు. కల్వకుర్తి ఎత్తిపోతలలో అంతర్భాగమైన వేళ్లూరు పంపింగ్ స్టేషన్, శ్రీశైలం కుడిగట్టు పవర్హౌస్లు మునిగిపోయిన సందర్భాల్లో వాటిని యథాస్థితికి తెచ్చిన గొప్ప ఇంజినీరు పెంటారెడ్డి అని కొనియాడారు. 80 ఏండ్ల వయస్సులోనూ రాష్ట్రాభివృద్ధికి శ్రమిస్తున్న పెంటారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని చెప్పారు.