Satyanarayana | హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నామినేట్ కావడానికి ప్రొఫెసర్ కోదండరాంకు ఉన్న అర్హతలేమిటి? తనకు లేనిది ఏమిటని మాజీ ఎమ్మెల్యే కే సత్యనారాయణ ప్రశ్నించారు. తన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరసరించిన తీరు బాధ కలిగించిందని, రాజ్యాంగ పరిరక్షకురాలిగా ఉండాల్సిన గవర్నర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించారని మండిపడ్డారు. రాజకీయ నాయకుడినంటూ తన పేరును తిరస్కరించిన గవర్నర్.. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కోదండరాంను ఎలా ఆమోదించారని ప్రశ్నించారు. బుధవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. దొడ్లలో చెప్పులు మోసేవారిని కేసీఆర్ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేశారంటూ వ్యాఖ్యానించిన సీఎం రేవంత్రెడ్డి ఎరుకలను అవమానించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎరుకల జాతికి రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోవాలని సూచించారు. ఎరుకల కులంలో పుట్టిన తనకు జనరల్ స్థానంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన చరిత్ర ఉన్నదని చెప్పారు. ఎరుకల జాతి నుంచి కనీసం ఎంపీటీసీ కూడా లేని పరిస్థితుల్లో ఎమ్మెల్సీగా తనను కేసీఆర్ నామినేట్ చేశారని చెప్పారు. తన పేరును గవర్నర్ తిరసరించినపుడు ఇంకో ఎరుకల కులస్థుడిని ఎందుకు నామినేట్ చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ఎరుకల సంఘం అధ్యక్షుడు కుతాడి రాములు మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి తమ జాతిని అవమానించారని మండిపడ్డారు. తమ కులానికి ఎమ్మెల్సీగా లేక లేక అవకాశం వస్తుందనుకుంటే గవర్నర్ దక్కకుండా చేశారని ఆవేదన వ్యక్తంచేశారు.