Police Act | హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, ప్రజాపాలన అంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు తెలంగాణను నిర్బంధంలోకి నెడుతున్నది. అధికారంలోకి రాగానే ప్రజాభవన్ వద్ద కంచెలు కూల్చి, ఇకపై ఆంక్షలు ఉండవంటూ హడావుడి చేసిన ప్రభుత్వం.. 11 నెలల తర్వాత తన అసలు రంగును బయటపెట్టింది. తమ అసమర్థ పాలనను, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పోలీసులను నమ్ముకుంటున్నది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ యాక్ట్ను అమలు చేసే దిశగా అడుగు లు వేస్తున్నది. అసంబద్ధ నిర్ణయాలతో రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల సంతోషాలను మింగేసిన కాంగ్రెస్.. ఇప్పుడు ప్రశ్నించే హక్కును కాలరాసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే హైదరాబాద్లో 144 సెక్షన్ అమలులో ఉండగా.. జిల్లాల్లోనూ పోలీస్ యాక్ట్ను అమలు చేస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో ఈ నెల మొత్తం పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్టు ఎస్పీ రూపేశ్ శుక్రవారం ఉత్తర్వులను జారీచేశారు. కామారెడ్డి జిల్లాలో ఈ నెల 7 వరకు పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం ఇప్పటివరకు అధికారికంగా 13 జిల్లాల్లో పోలీస్ యాక్ట్ను అమలు చేసిందని చెప్తున్నా రు. అనధికారికంగా 20కి పైగా జిల్లాల్లో పోలీస్ యాక్ట్ నిబంధనలను అమలు చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. మిగతా జిల్లాల్లోనూ త్వరలో పోలీస్ రాజ్యం మొదలయ్యే అవకా శం ఉన్నదని హెచ్చరికలు చేస్తున్నారు. అప్పు డు చట్టాన్ని బూచిగా చూపి ప్రశ్నించే ప్రతి గొంతుకను అడ్డుకుంటుందని చెప్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 11 నెలల కాలంలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నది. దీంతో రాష్ట్రంలో ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు నిత్యకృత్యం అయ్యాయి. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న అసంబద్ధ విధానాలతో అడ్డామీది కూలీలు మొదలు ఇతర అన్నివర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రాజెక్టు, ఉచిత బస్సు ప్రయణం, బతుకమ్మ చీరల ఆర్డర్ నిలిపివేత. ఇలా ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను ప్రభావితం చేసింది. రుణమాఫీ చేయాలని, రైతుబంధు ఇవ్వాలని అన్నదాతలు, ఉపాధి కోల్పోయామంటూ ఆటో డ్రైవర్లు, చేనేత కార్మికులు, చదువుకునే సమయం ఇవ్వాలని నిరుద్యోగులు, రీయింబర్స్మెంట్ మంజూరు చేయాలని విద్యార్థులు.. ఇలా నష్టపోయిన ప్రతి వర్గం ప్రజలు రోడ్ల మీదికి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ప్రజాభవన్ వేదికగా వివిధ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. చివరికి పోలీసులు సైతం రాష్ట్రంలో ధర్నాలు చేసే పరిస్థితి దాపురించింది.
రాష్ట్రంలో నిరసనలు తీవ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందించినట్టు తెలుస్తున్నది. ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఇలాగే కొనసాగితే ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడిస్తారని, కాంగ్రెస్ నేతల ఇండ్ల వద్ద బైఠాయిస్తారని నివేదికల్లో స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో ఎక్కడికక్కడ నిర్బంధం అమలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు సమాచారం. ఈ దిశగానే జిల్లాల్లో క్రమంగా పోలీస్ యాక్ట్ను అమలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
మొదటి నుంచీ ప్రభుత్వం చెప్తున్నదానికి, చేస్తున్నదానికి పొంతన ఉండటం లేదు. సచివాలయం గేట్లు ఓపెన్గా ఉంటాయని, ఎప్పుడైనా వచ్చి, ఏ మంత్రినైనా కలువొచ్చని మొదట్లో సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. సచివాలయం వద్ద సాయంత్రం 3-5 గంటల మధ్య మాత్రమే పాస్లు ఇస్తున్నారు. లోపల ఆరో అంతస్థు, రెండో అంతస్థులో ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఆ తర్వాత వరుస నిరసనలతో షాక్ తిన్న సీఎం.. ‘నిరసనలు వద్దు. నేరుగా వచ్చి నన్ను కలవండి. మీ రేవంత్ అన్నగా పరిష్కరిస్తా’ అని మరోసారి నమ్మబలికారు. కానీ, ఎక్కడా నేరుగా ఆయనను కలిసే అవకాశం లేకుండాపోయింది. ఇంటి వద్దకు వెళ్తే పీఏలు, పీఎస్లు బాధితుల నుంచి దరఖాస్తులు తీసుకొని పంపించి వేస్తున్నారు. సచివాలయానికి వెళ్తే ఆరో అంతస్థులోకి ప్రవేశం నిషిద్ధం.
డిప్యూటీ సీఎం భట్టి వద్దకు వెళ్లేందుకు బారికేడ్లను అడ్డుపెట్టారు. ఇంటివద్ద, ఇటు సచివాలయంలో బారికేడ్లు ఏర్పాటు చేసుకున్నారు. నిరసనలు హోరెత్తుతుండటంతో సచివాయలం, సీఎం నివాసం చుట్టూ 2 కిలోమీటర్ల మేర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సీఎం ఇల్లు, కార్యాలయం, సచివాలయ భద్రతా సిబ్బందిని మార్చేశారు. టీజీఎస్పీ సిబ్బందిని తొలిగించి టీజీఎస్పీఎఫ్కు బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ ఎప్పుడో ఇనుప కంచెల చాటుకు వెళ్లిపోయిందని ప్రజలు మండిపడుతున్నారు. ప్రజాపాలన 11 నెలలకే ఎక్స్పైరీ అయ్యిందని ఎద్దేవా చేస్తున్నారు.
కాంగ్రెస్ పాలనను ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిపై కేసులు నమోదవుతున్నాయి. ఆగస్టులో రూ.2 లక్షల రుణమాఫీ కాలేదంటూ రైతులు రోడ్లమీదికి రాగా పోలీస్ యాక్ట్ను ఎంచుకున్నది. ఆదిలాబాద్లో నిరసన తెలిపిన తలమడుగు మండలం రుయ్యాడికి చెందిన 11 మంది రైతులు, బజార్హత్నూర్కు చెందిన నలుగురు రైతులపై కేసులు నమోదు చేశారు. నిజామాబాద్లో 11 నెలల్లో మూడుసార్లు ఈ చట్టాన్ని ప్రయోగించారు. యాదాద్రి భువనగిరి, మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో యాక్ట్ అమల్లో ఉన్నది. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని భావిస్తే ఈ యాక్ట్ అమలు చేస్తారు. కానీ ప్రజలు నిరసన తెలుపుతారనుకున్న ప్రతిసారీ ఈ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నదని ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): సచివాలయం బందోబస్తు బాధ్యతలను తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) శుక్రవారం స్వీకరించింది. మొత్తం 214 మంది ఎస్పీఎఫ్ సిబ్బందికి రక్షణ బాధ్యతలు అప్పగించారు. సచివాలయ భద్రత పర్యవేక్షణ అధికారిగా దేవిదాస్ నియమితులయ్యారు. గతంలో సచివాలయానికి ఎస్పీఎఫ్ బలగాలే బందోబస్తు నిర్వహించేవి. కొత్త సచివాలయం నిర్మించిన తర్వాత ఆ బాధ్యతను స్పెషల్ పోలీసులకు (టీజీఎస్పీ) అప్పగించారు. ఇటీవల ఏక్ పోలీస్ విధానం అమలు కోసం టీజీఎస్పీ కానిస్టేబుళ్లు, వారి కుటుంబాలు ధర్నాలు చేస్తుండడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. ముఖ్యమంత్రి నివాసం, కార్యాలయం, సచివాలయం వద్ద విధుల్లో ఉన్న టీజీఎస్పీ కానిస్టేబుళ్లు ధర్నా చేస్తే పరువు పోవడంతోపాటు భద్రతకు ముప్పు కలుగుతుందని ప్రభుత్వం భావించింది. వెంటనే టీజీఎస్పీని పక్కకు తప్పించింది. మొదట సీఎం నివాసం, కార్యాలయం, తాజాగా సచివాలయాన్ని ఎస్పీఎఫ్ పరిధిలోకి తీసుకెళ్లింది