గంగాధర, జూలై 16: ‘పంటలకు నీరందించాలని కోరిన బీఆర్ఎస్ నేతల రక్తం చల్లాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి నెత్తురు రుచిమరిగిన తోడేలులా ప్రవర్తిస్తున్నడు. తన గురువు చంద్రబాబు మెప్పు కోసం ఆంధ్రకు నీళ్లు ఇస్తూ.. తెలంగాణను ఎండబెడుతూ కన్నీళ్లు పెట్టిస్తున్నాడు’ అని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. పొలాలకు నీళ్లు ఇవ్వమని అడిగితే బీఆర్ఎస్ నాయకుల రక్తం చల్లాలని ఇటీవల రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, గ్రంథాయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా సుంకె మా ట్లాడుతూ.. తెలంగాణ రైతుల కోసం బీఆర్ఎస్ నాయకులు ఎంత రక్తమైనా ఇస్తారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసి ఇక్కడి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం జలాలతో తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని, కేవలం కేసీఆర్ను బద్నాం చేయడానికే రేవంత్రెడ్డి నీటిని ఎత్తిపోయడంలేదని దుయ్యబట్టారు.