Chandrababu | హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు తన అరెస్ట్ సంగతి నెల క్రితమే తెలుసా? అరెస్టును తప్పించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చంద్రబాబు కోసం రాయబారం నెరిపారా? ఇందులో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇన్వాల్వ్ అయ్యారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్’ మంగళవారం సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రకారం రేవంత్రెడ్డి ఇటీవల కర్ణాటకకు వెళ్లి డీకే శివకుమార్తో భేటీ అయ్యారు. అదే సమయంలో చంద్రబాబునాయుడు, డీకే శివకుమార్కు ఫోన్ చేసి మాట్లాడినట్టు కథనంలో పేర్కొంది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిపింది.
ఈ కథనాన్ని బట్టి బాబు, రేవంత్ మధ్య బంధం మరోసారి బట్టబయలైంది. ‘టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో తనది సహచర బంధమే తప్పా.. తమ మధ్య ఎలాంటి గురుశిష్యుల బంధం లేదు’ అంటూ రేవంత్ చెప్పిన మాటలు పూర్తి అబద్ధమని తేలిపోయింది. బాబు తరఫున ఏసీబీ కోర్టులో వాదించిన న్యాయవాది సిద్దార్థ్ లూథ్రాకు డీకేతో మంచి సంబంధాలున్నాయి. డీకేకు ఆయన అన్ని విషయాల్లో తోడుగా ఉంటారు. డీకే సిఫారసుతోనే బాబు కేసులో లూథ్రా రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది. ఇలా రేవంత్రెడ్డి తన గురువును కాపాడుకొనేందుకు తాపత్రయ పడుతున్నారనే అభిప్రాయాలు నెలకొన్నాయి. ఇద్దరి మధ్య బంధం విడిపోయేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో రేవంత్రెడ్డి చంద్రబాబు షాడోలా పని చేస్తున్నారనే ఆరోపణలకు ఇది మరింత బలం చేకూరుస్తున్నది.