MLA Seethakka | హైదరాబాద్, జూలై 10, (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్లో కుర్చీలాట మ్యూజికల్ చైర్ను తలపిస్తున్నది. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం.. అన్న చందంగా అప్పుడే ముఖ్యమంత్రిగా ఎవరు? అనే పంచాయితీ మొదలైంది. పార్టీలో అప్పుడే ఒకరికి ఒకరు చెక్ పెట్టుకునే దిశగా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి చెక్ పెట్టడానికి సీఎం అభ్యర్థిగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను పార్టీలో సీనియర్లు తెరపైకి తీసుకురాగా, ప్రతిగా భట్టికి చెక్ పెట్టడానికి సీతక్కను రేవంత్రెడ్డి తెరపైకి తీసుకువచ్చారు. భట్టి దళిత నేత కాగా సీతక్క గిరిజన నేత. దళితుడికి పోటీగా గిరిజన నేత సీతక్కను తెరపైకి తీసుకరావడం ద్వారా పార్టీలో అటు సీనియర్లకు, ఇటు భట్టికి చెక్ పెట్టినట్టుగా ఉంటుందన్నది రేవంత్రెడ్డి వ్యూహం అని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రను రేవంత్రెడ్డి వ్యతిరేక శిబిరం తమకు అనుకూలంగా మార్చుకున్నది. ఈ యాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం సభలో భట్టిని రాహుల్ గాంధీ అభినందించారు.
ఈ సభను పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్లో చేరిక సందర్భంగా ఏర్పాటు చేశారు. రేవంత్రెడ్డి వ్యతిరేక వర్గీయులు దీనిని భట్టి అభినందన సభగా మార్చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం పదవి దళితుడైన భట్టికే దక్కుతుందన్న ప్రచారాన్ని రేవంత్రెడ్డిని వ్యతిరేకించే నాయకులు బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని తిప్పికొట్టేందుకు రేవంత్రెడ్డి వేసిన పాచికగా సీతక్క పేరును తెరపైకి తెచ్చి ఉంటారని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికాలో ‘తానా’ సభ వేదికగా సీఎం అభ్యర్థిగా సీతక్క పేరును రేవంత్రెడ్డి ప్రకటించడం పార్టీలో సీనియర్లకు మింగుడు పడటం లేదు. రేవంత్ చేసిన ప్రతిపాదన భట్టికి చెక్ పెట్టడానికేనని పార్టీలో కొందరు నాయకులు అభిప్రాయపడుతుండగా, టీడీపీ నుంచి తన వెంట కాంగ్రెస్లోకి వచ్చిన సీతక్క అయితే తాను చెప్పినట్టు వింటుందన్నది ఆయన ఎత్తుగడ కావచ్చని ఇంకొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద సీతక్క పేరును రేవంత్రెడ్డి తెరపైకి తీసుకురావడంతో కాంగ్రెస్లో ఇంకో కొత్త పంచాయితీ రాజుకున్నట్టు అయింది.