తెలంగాణ వైతాళికుడు, పాలమూరు బిడ్డ సురవరం ప్రతాపరెడ్డి జయంతి ఈ రోజు (మంగళవారం- మే 28). తెలంగాణలో కవులే లేరని అలనాడు ఆంధ్రావాదులు తూలనాడితే దాన్ని సవాలుగా తీసుకొని 354 మంది తెలంగాణ కవుల జీవిత విశేషాలతో, వారి రచనలతో కూడిన ‘గోల్కొండ కవుల సంచిక’ను ప్రచురించిన ధీశాలి, తెలంగాణ చైతన్య ప్రతీక ఆయన. అటు పత్రికా సంపాదకుడిగా, పరిశోధకుడిగా, పండితుడిగా, ఉద్యమకారుడిగా వనపర్తి ఎమ్మెల్యేగా తెలంగాణ జాతికి సురవరం చేసిన సేవలు మరువలేనివి. ఆంధ్రుల అహంకారానికి చెంపపెట్టుగా సురవరం నాడు తెలంగాణ వైభవాన్ని, ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తున నిలబెట్టారు.
అటువంటి సురవరం ప్రతాపరెడ్డి జయంతి రోజు ఆయన పుట్టిన జిల్లా నుంచే వచ్చిన రేవంత్రెడ్డి తెలంగాణ జాతి గీత స్వరకల్పనను ఆంధ్రా సంగీత దర్శకుడికి అప్పగించారనే విమర్శకు కారణమయ్యారు. తెలంగాణలో సంగీత దర్శకులే లేరా! అన్న ప్రశ్నకు జవాబు ఇచ్చుకోవాల్సిన స్థితిలో చిక్కుకున్నారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం, జయ జయహే గీతంలో మార్పుల కోసం ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నం పెనువివాదంగా మారింది.
హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జాతిగీతానికి కీరవాణి సంగీతాన్ని సమకూర్చటంపై వివాదం చెలరేగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా కీరవాణిపై విమర్శలు రావడంతో సీఎం రేవంత్రెడ్డి ఉన్నపళంగా వాటి నుంచి తప్పించుకోవటానికి, ఈ వివాదం మొత్తాన్ని చాకచక్యంగా అందెశ్రీపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ‘సంగీత దర్శకుడిని ఎంపిక చేసుకునే బాధ్యతను అందెశ్రీకే అప్పగించాను’ అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పేర్కొనటం హాస్యాస్పదంగా ఉందని సాహితీవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం అధికారికంగా గుర్తించినా.. గుర్తించకపోయినా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఈ జయ జయహే తెలంగాణ కంఠతా వచ్చునని వారు ఉదహరిస్తున్నారు. రాష్ట్రంలో అందెశ్రీపై ఉద్యమకారులకు, సాహితీకారులకు అపారమైన గౌరవం ఉందని, తమ స్వార్థప్రయోజనాల కోసం ఆయన గౌరవాన్ని తక్కువ చేసే పనికి ఎవరూ పూనుకోరని అంటున్నారు. వివాదం చెలరేగేసరికి దాన్ని అందెశ్రీపై తోసేయటం విమర్శలకు తావిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాడే, బ్యాండ్గా వాయించే గీతానికి సంగీతం సమకూర్చుకునే బాధ్యత గీత రచయితకే అప్పగించాను అని పేర్కొనటంపై పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అందెశ్రీకి సంగీత దర్శకుడిని ఎంపిక చేసుకునే బాధ్యత అప్పగించటం అంటే అందెశ్రీ అధికారికంగా ఏ హోదాలో ఉన్నారని ఆయనకు అప్పగించారు? రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కారద్యర్శి, సాంస్కృతికశాఖ అందెశ్రీ సారథ్యంలో పాటకు సంగీతాన్ని సమకూర్చేందుకు ఏదైనా కమిటీ వేసిందా? ఆ కమిటీ కీరవాణిని ఎంపిక చేసిందా? నిజంగా అందెశ్రీకే అన్ని బాధ్యతలు అప్పగిస్తే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీరవాణితో చర్చలెందుకు జరిపినట్టు? రికార్డింగ్ స్టూడియోకు ఎందుకు వెళ్లినట్టు? అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది.
ఒకవేళ నిజంగా గీత రచయితకే బాధ్యతలు అప్పగించానని చెప్తున్న సీఎం రేవంత్రెడ్డి ఆ గీత రచయిత వ్యక్తం చేస్తున్న భావాలను అంగీకరించినట్టేనా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ వాదులపై తుపాకీ ఎక్కుపెట్టిన నాయకుడిగా సీఎం రేవంత్రెడ్డిని ఇప్పటికే రైఫిల్రెడ్డి అని, తెలంగాణ ఉద్యమం నుంచే కాకుండా కనీసం సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటిదాకా కనీసం ఒక్కసారి కూడా ‘జై తెలంగాణ’ అనని నాయకుడిగా సీఎం రేవంత్రెడ్డిపై విమర్శలున్నాయి.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలోకానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదలైన తొలి అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందుకానీ గన్పార్క్లోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించలేదనే విమర్శలను సీఎం రేవంత్రెడ్డి మూటగట్టుకున్నారు. కీరవాణిని ఎంపిక చేయటం తమను అవమానించటమేనని తెలంగాణలో ఉన్న సంగీతదర్శకులు ఆగ్రహంతో ఉన్నారు.
‘తెలంగాణలో కవులు పూజ్యం’ అని వ్యక్తం చేసిన ఆంధ్రా ఆధిపత్యంపై ఆగ్రహించిన సురవరం ప్రతాపరెడ్డి 354 మంది కవులు సృజించిన ‘సాహిత్యం’తో గోల్కోండ కవుల సంచికను తెచ్చిన సందర్భం నాటి పరిస్థితులకు ప్రస్తుతం తెలంగాణ చుట్టూ ముసురుకున్న చీకటి నేపథ్యాన్ని తెలంగాణవాదులు గుర్తుచేసుకోవటం గమనార్హం.
సర్కారు తీరుపై పోటెత్తిన తెలం‘గానం’
తెలంగాణ ఉద్యమంతో బంధం పెనవేసుకోనివాళ్లు.. కనీసం చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ అంశాలపైనే కాకుండా కనీసం భౌతిక వాస్తవిక అంశాలతో సంబంధంలేని వాళ్లు పాలకులుగా ఉంటే ఇటువంటి పరిణామాలే సంభవిస్తాయని రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చరిత్రకారులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలకు గత పాలకులపై ఆధిపత్యం చెలాయించాలనే యావ తప్ప తెలంగాణ మూలాలపై కనీస అవగాహనలేదని వారు విమర్శిస్తున్నారు.
కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ను రాచరికపు ఆనవాళ్లుగా గుర్తించటమే భావదారిద్య్రానికి నిదర్శనమని చరిత్రకారులు మండిపడుతున్నారు. సీఎం రేవంత్ చర్యలు తెలంగాణ సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని మండిపడుతున్నారు. ‘చార్మినార్ అంటే.. ఒక కట్టడం కాద ని, విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్కు ఐకాన్’ అని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే ‘కాకతీయ కళాతోరణం అంటే.. ఒక నిర్మాణం కాదు.. సిరిసంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకం’ అని అభివర్ణించా రు. వీటిని తొలగించటం అంటే తెలంగాణ చరిత్రను చెరిపేయటమేనని వ్యాఖ్యానించారు.