KTR | కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి తులం బంగారం కాదు కదా.. తులం ఇనుము కూడా ఇవ్వరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గడిచిన ఆరు నెలల్లో లక్షన్నర పెండ్లిలు జరిగాయని, ఆడ బిడ్డలకు రేవంత్ రెడ్డి లక్షన్నర తులాల బంగారం బాకీ ఉన్నారని చెప్పారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయని 420 రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు.
ఆరు గ్యారెంటీల్లో ఒక్క హామీ అమలు చేసి, ఐదు చేసినట్లు ప్రగల్భాలు పలుకుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఫ్రీ బస్సుల్లో సీట్ల కోసం మహిళలు, టికెట్ల కోసం పురుషులు కొట్లాడుకుంటున్నారని చెప్పారు. డిసెంబర్ 9న రుణమాఫీ ఫైల్పై సంతకం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు రుణమాఫీ ఊసేలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో దొడ్డు బియ్యానికి బోనస్ అని చెప్పి, ప్రభుత్వం ఏర్పడ్డాక సన్న వడ్లకే అని మాట మార్చారని మండిపడ్డారు. 95శాతం రైతులు దొడ్డు వడ్లు పండిస్తారని, సన్న బియ్యానికే బోనస్ అని బోగస్ మాటలు చెబుతున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదన్నారు. రేవంత్ రెడ్డి లాంటి ఇంద్రజాలికుడిని ఎక్కడా చూడలేదన్నారు. నోటిఫికేషన్లు లేవు, రాత పరీక్షలు లేవని, కానీ 30వేల ఉద్యోగాలు ఇచ్చామని దొంగ మాటలు చెబుతున్నారని విమర్శించారు.
లంకె బిందెలు ఉన్నాయనుకుంటే ఖాళీ కుండలు ఉన్నాయని సీఎం అంటున్నారని, లంకె బిందెలు కావాలని దొంగలే తిరుగుతారని కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు నాయకుడు కాదని, రియల్ ఎస్టేట్ వ్యాపారి అని దుయ్యబట్టారు. ఏ ముఖ్యమంత్రైనా రాష్ట్రం అప్పుల్లో ఉందని చెబుతారా..? దివాలా తీసిందని అంటారా..? ఇట్ల మాట్లాడితే రాష్ర్టానికి పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమికొట్టింది కేసీఆర్ కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందించి ఫ్లోరైడ్ను రూపుమాపారని గుర్తు చేశారు. వెయ్యేండ్లు గుర్తుండిపోయేలా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఆలయాన్ని పునర్నిర్మించింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. మహాలక్ష్మీ పథకం తెలంగాణలో అమలవుతున్నదని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తామని నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. 420 హామీలు ఇచ్చిన హస్తం పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి దెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు. ఓ వైపు గోల్డ్ మెడలిస్ట్, మరోవైపు బ్లాక్మెయిలర్ ఉన్నారని, ఇటు వైపు బిట్స్ ఫిలానీ, అటు వైపు పల్లీ బఠాణీ ఉన్నారని, ఎవరు కావాలో పట్టభద్రులే నిర్ణయించుకోవాలని సూచించారు.