KRMB| హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన 15 ఔట్లెట్లను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పగించేందుకు తొలుత అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు వెనకడుగు వేసింది. ఇంటా, బయటా తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో తెలంగాణ డిమాండ్లను పరిష్కరించే వరకూ ఆ ప్రాజెక్టులను అప్పగించేది లేదని కేంద్రానికి స్పష్టం చేసింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కేంద్ర జల్శక్తి శాఖకు లేఖ రాసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం శ్రీశైలం డ్యామ్ ఏపీ పరిధిలో, సాగర్ డ్యామ్ తెలంగాణ పరిధిలో ఉండాలి. కానీ, గతేడాది నవంబర్ 29న ఏపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా సాగర్ డ్యామ్ను అక్రమించడంతో కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ జనవరి 17న తెలంగాణ, ఏపీ అధికారులతో న్యూఢిల్లీలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
శ్రీశైలం, సాగర్ డ్యామ్లతోపాటు వాటికి సంబంధించి 15 ఔట్లెట్లు, ఉద్యోగులను బోర్డుకు అప్పగించాలని ఆదేశించారు. అందుకు ఏపీతోపాటు, తెలంగాణ సర్కారు కూడా అంగీకరించింది. దీంతో తెలంగాణ జల హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతుందని రాష్ట్ర ఇంజినీర్లు, సాగునీటి రంగం నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు రేవంత్రెడ్డి సర్కారు నిర్ణయంపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో దాదాపుగా 10 రోజులపాటు తర్జన భర్జన పడిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు వెనకడుగు వేసింది. ప్రాజెక్టులను అప్పగించబోమంటూ కేంద్ర జల్శక్తి శాఖకు లేఖ రాసింది.
తెలంగాణ వాదనలను తప్పుగా రికార్డ్ చేశారు..
ప్రాజెక్టుల అప్పగింతకు తొలుత తెలంగాణ అంగీకరించినట్టు జనవరి 17 నాటి సమావేశ మినిట్స్లో కేంద్ర జల్శక్తి శాఖ స్పష్టంగా తెలియజేసింది. దీంతో ఆ మినిట్స్ను తప్పుబడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్రానికి లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం అక్రమంగా సాగర్ డ్యామ్ను ఆక్రమించిన ఉదంతం నేపథ్యంలో ఇరు రాష్ర్టాలతో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ వాదనలను సరిగా రికార్డు చేయలేదని, తాము అంగీకరించని అంశాలను కూడా అంగీకరించినట్టుగా రికార్డు చేశారని అభ్యంతరం వ్యక్తం చేసింది.
ప్రాజెక్టుల అప్పగింతపై ప్రభుత్వ అభిప్రాయం తీసుకున్న తర్వాత నిర్ణయం తెలియజేస్తామని మాత్రమే చెప్పామని, దీనికి విరుద్ధంగా 15 ఔట్లెట్ల అప్పగింతకు అంగీకరించినట్టు మినిట్స్లో నమోదు చేశారని ఆ లేఖలో పేర్కొంటూ.. మినిట్స్ను సవరించాలని విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా ఆపరేషన్ ప్రొటోకాల్, 50ః50 నిష్పత్తిలో నీటి వాటా, జల విద్యుత్తు ప్రాజెక్టులు, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ తదితర అంశలపై తెలంగాణ చేసిన వాదనలను రికార్డు చేసి వాటిని కూడా మినిట్స్లో నమోదు చేయాలని కోరింది.
ట్రిబ్యునల్ అవార్డు, ఆపరేషన్ ప్రొటోకాల్ ఖరారైన తర్వాతే ప్రాజెక్టుల స్వాధీనానికి చర్యలు చేపట్టాలని, అప్పటివరకు ప్రాజెక్టులను అప్పగించబోమని కేఆర్ఎంబీ 17వ సమావేశంలోనే స్పష్టం చేశామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సాగర్ డ్యామ్పై సీఆర్పీఎఫ్ బలగాలు అవసరం లేదని పేర్కొన్నది.
నేడు కేఆర్ఎంబీ కీలక సమావేశం
ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర జల్శక్తి శాఖ జనవరి 17 సమావేశంలో రెండు రాష్ర్టాలతోపాటు కేఆర్ఎంబీకి మార్గదర్శకాలను జారీ చేసింది. ఆయా ప్రాజెక్టులు, ఔట్లెట్ల ఆపరేషన్ ప్రొటోకాల్ తదితర సాంకేతిక అంశాలపై చర్చించుకుని వారం రోజుల్లోగా కచ్చితమైన కార్యాచరణ ప్రణళికను ఖరారు చేయాలని ఆ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
దీంతో ఆపరేషన్ ప్రొటోకాల్ ఖరారుపై తెలంగాణ, ఏపీ ఈఎన్సీలతో కేఆర్ఎంబీ గురువారం కీలక సమావేశాన్ని నిర్వహించనున్నది. పూర్తి యాక్షన్ప్లాన్తో ఈ సమావేశానికి రావాలని రెండు రాష్ర్టాలకు సూచించింది. ఈ సమావేశాన్ని బహిష్కరించాలని రాష్ట్ర అధికారులు తొలుత భావించినప్పటికీ అంతిమంగా హాజరుకావాలనే నిర్ణయించుకున్నట్టు తెలిసింది. కేంద్ర జల్శక్తి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖను కేఆర్ఎంబీకి కూడా అందజేసి అవే వాదనలు బోర్డుకు నివేదించాలని తెలంగాణ అధికారులు సిద్ధమైనట్టు సమాచారం.