హైదరాబాద్, డిసెంబర్9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ కొలువుదీరింది. శనివారం ఉదయం 11 గంటలకు మొదటి సెషన్ ప్రారంభమైంది. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ నూతన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. తొలుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో ప్రమాణం చేయించగా, అనంతరం వరుసగా మంత్రులు సీతక్క, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఒక్కో ఎమ్మెల్యే ప్రమాణస్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా 16 మంది సభ్యులు హాజరు కాలేదు. ఎంపీ పదవులకు రాజీనామా చేయకపోవడంతో ఉత్తమ్, వెంకటరెడ్డి హాజరు కాలేదు. తుంటి ఎముక ఆపరేషన్ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాలేకపోయారు. దవాఖానలో ఆయనతోనే ఉన్న సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కూడా సభకు హాజరు కాలేదు. వీరితోపాటు బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయకపోవడంతో వారు కూడా సభకు హాజరు కాలేదు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేయకపోవడంతో ఆయన కూడా ప్రమాణస్వీకారం చేయలేదు. ఎమ్మెల్యేలు పద్మారావుగౌడ్, బత్తుల లక్ష్మారెడ్డి సైతం ప్రమాణ స్వీకారం చేయలేదు. ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఉండడంతో 8మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. వీరు మినహా మిగతా అందరూ ప్రమాణ స్వీకారం చేశారు.
శాసనసభ ప్రారంభానికి ముందుగా హాలులోకి ప్రవేశించిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ నేరుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్రావు, పోచారం శ్రీనివాస్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డి.. ఇలా ప్రతి ఒక్కరికి వద్దకు వెళ్లి పేరుపేరునా పలకరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం సీఎం రేవంత్రెడ్డి, నూతన మంత్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సభ్యులు సైతం ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం రేవంత్రెడ్డి, మంత్రులకు అభివాదం చేశారు. ప్రొటెం స్పీకర్ వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలియజేసిన అనంతరం అసెంబ్లీ రిజిస్టర్లో సంతకాలు చేశారు. అనంతరం నూతన సభ్యులు అసెంబ్లీలోని సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల వద్దకు వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు.
కొత్తగా కొలువుదీరిన శాసనసభలో తొలిరోజున కోలాహలం నెలకొన్నది. సభలో మొదటి వరుసలో సీఎం రేవంత్రెడ్డి, తర్వాత ఖమ్మం జిల్లాకు చెందిన భట్టి, తుమ్మల, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సీతక్క, కొండా సురేఖలు పక్కపక్కనే కూర్చుకోవడం ఆసక్తి రేపింది. ప్రతిపక్షం వైపు మొదటి వరుసలో బీఆర్ఎస్ మాజీ మంత్రు లు హరీశ్రావు, మాజీ స్పీకర్ పోచారం, తలసాని పక్కపక్కనే కూర్చున్నారు. నూతన సభ్యు ల ప్రమాణ స్వీకారోత్సవాన్ని వీక్షించేందుకు వారి వెంట బంధువులు, స్నేహితులు కూడా అసెంబ్లీకి తరలివచ్చారు. గ్యాలరీల్లో కూర్చుని ఆసక్తిగా తిలకించారు. అసెంబ్లీ ప్రాంగణంలో సెల్ఫీలు తీసుకుని మురిసిపోయారు.
నూతన సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు కొత్త పథకాలను ప్రారంభిస్తున్నట్టు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. తొలుత రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచుతున్నట్టు వెల్లడించారు. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపారు. అనంతరం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మహాలక్ష్మి పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నట్టు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. ఈ పథకం కూడా శనివారం నుంచే అందుబాటులోకి వస్తున్నట్టు ప్రకటించారు. అన్ని పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు తెలిపారు. అనంతరం శాసనసభను 14వ తేదీకి వాయిదా వేశారు.
కొత్తగా కొలువుదీరిన మూడవ శాసనసభలో పలువురు సీనియర్, నూతన సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం వేళ తడబాటుకు గురయ్యారు. ‘శాసనసభ నియమాలను పాటిస్తామని’ ప్రతిజ్ఞ చేసే సమయంలో నియమాలు, సార్వభౌమాధికారం వంటి పదాల వద్ద తడబాటుకు గురయ్యారు. 17 మంది ఎమ్మెల్యేలు ఆంగ్లంలో ప్రమాణం చేయగా, మజ్లిస్ ఎమ్మెల్యేలు ఉర్దూలో ప్రమాణం చేశారు.
తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభ తొలిరోజున బోథ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్, రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ఠాకూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బోథ్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయిన అనిల్జాదవ్ అసెంబ్లీకి చెప్పులు లేకుండానే హాజరయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచేంత వరకూ చెప్పులు వేసుకోబోనని అనిల్ జాదవ్ దీక్ష తీసుకున్నారు. ఈ నేపథ్యంలో చెప్పులు లేకుండానే అసెంబ్లీకి విచ్చేశారు. సోమవారం దీక్ష విరమించనున్నట్టు తెలిపారు. సింగరేణి పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మక్కన్సింగ్ రాజ్ఠాకూర్ సింగరేణి గని కార్మికుడి వేషధారణలో అసెంబ్లీకి విచ్చేశారు. ప్రమాణ స్వీకారం చేసి అందరినీ ఆకర్షించారు.