మహబూబ్నగర్ అర్బన్, మార్చి 7: కాంగ్రెస్లో రేవంత్రెడ్డే మరో ఏక్నాథ్ షిండే కావొచ్చని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. గురువారం ఆమె మహబూబ్నగర్లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ అవకాశవాది అని, ఆదిలాబాద్లో మొన్న ప్రధాని మోదీ ఎదుటే బడేభాయ్ అన్న రేవంత్.. నిన్న పాలమూరులో మోదీ.. కేడీ అనడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమని అన్నారు.
ప్రధానిని కలిసిన అపవాదును తొలిగించుకునేందుకే రాజకీయ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ సభను చేస్తుంటే సంక్రాంతి గంగిరెద్దుల ఆటలు గుర్తొస్తున్నాయని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. దేశంలో 60 ఏండ్లు అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏం సాధించిందో చెప్పాలని ప్రశ్నించారు. రేవంత్కు దమ్ముంటే ఆరు గ్యారెంటీలను అమలు చేసి పాలమూరులో ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.