నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి
కేతేపల్లి, సెప్టెంబర్ 22: పీసీసీ నేత రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మతిభ్రమించి సీఎం కేసీఆర్పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం గుడివాడలో బుధవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో, నకిలీ స్టాంపుల కుంభకోణంలో అడ్డంగా దొరికిన రేవంత్రెడ్డి చరిత్ర రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. డ్రగ్స్ విషయంలో మంత్రి కేటీఆర్పై సవాల్ విసిరి వెనకడుగు వేసిన పిరికివాడు రేవంత్రెడ్డిని ఎద్దేవా చేశారు. తన భాష, ప్రవర్తనను మార్చుకోకపోతే ప్రజలే తగిన బుద్ధ్దిచెబుతారని హెచ్చరించారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. కేంద్రం నుంచి నిధుల తేవడం చేతకాని బండి సంజయ్ ఇక్కడ పాదయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధుపై బురదజల్లేందుకు రేవంత్రెడ్డి, బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. శాంతిమార్గంలో రాష్ర్టాన్ని సాధించిపెట్టిన సీఎం కేసీఆర్ను విమర్శించే స్థాయి వారికి లేదన్నారు. ఈ సందర్భంగా గుడివాడ గ్రామానికి చెందిన సుమారు 150 మంది కాంగ్రెస్, సీపీఎం నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.