హైదరాబాద్ : దేవరయాంజాల్లో నమస్తే తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ భూమి విషయంలో కాంగ్రెస్ నేత రేవంత్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారం, అబద్దమని నమస్తే తెలంగాణ యాజమాన్యం పేర్కొంది. ప్రింటింగ్ ప్రెస్ భూమి కొనుగోలు విషయంలో పూర్తి పారదర్శకంగా చట్ట ప్రకారం వ్యవహరించినట్లు తెలిపింది. ప్రింటింగ్ ప్రెస్ నిర్మాణం కోసం తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేటు లిమిటెడ్ దేవరయాంజాల్లో మూడు దఫాలుగా భూమిని కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.
మొదటి డీడ్ జరిగిన తేదీ 5 జనవరి,2011. డాక్యుమెంట్ నంబర్ 9/2011. విస్తీర్ణం ఒక ఎకరం. సర్వే నంబరు 437. కే. తారకరామారావు భూమి అమ్మగా టీపీపీఎల్ కొనుగోలు చేసింది. ల్యాండ్ కన్వర్షన్ జరిగిన తేదీ 11 ఫిబ్రవరి,2011.
రెండవ డీడ్ జరిగిన తేదీ. 6 మే, 2015. డాక్యుమెంట్ నెంబర్ 1829/2015. విస్తీర్ణం 2.08 ఎకరలు. సర్వే నంబరు 437. జాదవ్ వనమాల భూమిని అమ్మగా టీపీపీఎల్ కొనుగోలు చేసింది. ల్యాండ్ కన్వర్షన్ తేదీ 5 నవంబర్,2015.
మూడవ డీడ్ జరిగిన తేదీ. 19 సెప్టెంబరు,2019. డాక్యుమెంట్ నంబర్ 10407/2019. విస్తీర్ణం 1.06 ఎకరాలు. సర్వే నంబరు 437. రాజబోయిన యాకయ్య భూమిని అమ్మగా టీపీపీఎల్ కొనుగోలు చేసింది. ఈ భూమి కొనుగోలు ఒప్పందం 2015లోనే జరగ్గా రిజిస్ట్రేషన్ 2019లో పూర్తి అయింది. ల్యాండ్ కన్వర్షన్ తేదీ. 25 సెప్టెంబరు,2020.
దేవరయాంజాల్లో టీపీపీఎల్కున్న మొత్తం భూమి 4 ఎకరాల 14 గుంటలు మాత్రమే. ఈ భూమి అంతా తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి దీవకొండ దామోదర్ తండ్రి నారాయణరావు పేరిట ఉంది. భూమి మొత్తం 437 సర్వే నెంబరులోనే ఉంది. ఈ సర్వే నంబరు ఎండోమెంట్ భూముల జాబితాలో గానీ, నిషిద్ధ భూముల జాబితాలో కానీ లేదు.
దేవరయాంజాల్ ఎండోమెంట్ భూములకు సంబంధించి 14 అక్టోబరు,2004లో వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబరు 810 జారీ చేసింది. అక్కడ ఏవి ఎండోమెంట్ భూములో పాత, కొత్త సర్వే నెంబర్ల వారీగా భూ విస్తీర్ణం ఎంతో పేర్కొంటూ నాటి వైఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫలానా సర్వే నెంబర్లలోని భూములపై క్రయవిక్రయాలు జరపకూడదంటూ నిషిద్ధ భూముల జాబితాను సర్వే నెంబర్ల వారీగా ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన నిషిద్ధ సర్వే నెంబర్లలో పాత వాటిలో గానీ, కొత్త వాటిలో గానీ 437 సర్వే నెంబరు ఎక్కడా లేదు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ జీవోనే ఇప్పుడు రేవంత్ కాదంటున్నారా?
1954-55 ఖాస్రా పహాణీ మొదలుకుని 2020-21 అన్ పహాణీ వరకు అన్ని రెవెన్యూ పహాణీల్లోనూ 437 సర్వే నెంబరు పూర్తిగా పట్టాభూమి. 437 సర్వే నెంబరులో మొత్తం 10 ఎకరాల 37 గుంటల భూమి ఉంది. ఇదంతా కట్టా బాల్రెడ్డి, కట్టా అంజిరెడ్డి, కట్టా నర్సింహారెడ్డి, కట్టా లక్ష్మారెడ్డి పేరిట ఉంది. వీరి వారసుల నుంచి ఈ భూమిపై క్రయ విక్రయాలు జరిగాయి. దేవరయాంజాల్ భూమిలో ప్రింటింగ్ ప్రెస్ నిర్మాణానికి టీపీపీఎల్ 14 మార్చి 2011న గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకున్నట్లు యాజమాన్యం పేర్కొంది. ప్రింటింగ్ ప్రెస్ నిర్మాణానికి ఇన్ఆఫ్ ఫ్యాక్టరీస్ నుంచి 2012 మార్చిలో అనుమతి తీసుకున్నట్లు వెల్లడించారు. అనుమతి నంబరు జేడీఎం/675/2012.