Revanth Reddy | ఈ నెల 27న మరో రెండు హమీలను అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, రూ.200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తామని చెప్పారు. మేడారం మహాజాతర సందర్భంగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క సారలమ్మను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని.. త్వరలోనే రూ.2 లక్షల రుణమాఫీని కూడా చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మార్చి 2న మరో ఆరు వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు తెలిపారు. సమ్మక్క-సారలమ్మల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని అన్నారు. రాబోయే సమ్మక్క-సారలమ్మల జాతరను భక్తులకు అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తూ మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు. అమ్మవార్లను దర్శించుకోవాలని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాకు కూడా ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. వారి వచ్చినట్లయితే దగ్గరుండి స్వాగతం పలుకుతానని అన్నారు. దక్షిణ భారత దేశ కుంభమేళా వంటి సమ్మక్క-సారలమ్మ మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.