హైదరాబాద్/హుజూరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ నేత ఈటల రాజేందర్తో పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మిలాఖత్ అయ్యారు. ఉప ఎన్నికలో ఈటలకు మేలు జరిగేలా హుజూరాబాద్ బరిలో తమ పార్టీ తరఫున పోటీకి బలహీన అభ్యర్థిని ఎంపికచేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంతో సంబంధంలేని, ఏ రోజూ టికెట్ అడగని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ను అభ్యర్థిగా ప్రకటించారు. అసలు కరీంనగర్ జిల్లాతోనే సంబంధంలేని పెద్దపల్లి జిల్లా వ్యక్తిని హుజూరాబాద్ ఉప పోరులో దింపడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. టీడీపీ నుంచి వచ్చి పీసీసీ చీఫ్ అయిన రేవంత్రెడ్డి.. సొంత లాభం కోసం హుజూరాబాద్లో ఓటు బ్యాంకును దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రేవంత్ చర్య ఇరుపార్టీల శ్రేణుల్లో ఆగ్రహాన్ని కలిగించింది.
హుజూరాబాద్లో కాంగ్రెస్ తరఫున బరిలో దిగేందుకు 18 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో నియోజకవర్గానికి చెందిన జాలి కమలాకర్రెడ్డి, సాయిని రవికుమార్, గూడూరి స్వామిరెడ్డి, డాక్టర్ గుజ్జుల శ్రీనివాస్రెడ్డి, మొలుగూరి సదయ్య, నల్ల కొండల్రెడ్డి, తవుటము రవీందర్, పత్తి కృష్ణారెడ్డి, పర్లపల్లి నాగరాజు, గూడెపు సారంగపాణి, తోడుపు నూరి ముక్తేశ్వర్ ఉన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం వీరి అభ్యర్థనను పట్టించుకోలేదు. గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రి కొండా సురేఖ పేరును మొదట తెరపైకి తెచ్చింది. పోటీ చేయాలంటే ఆమె పలు షరతులు విధించారు. చివరికి కరీంనగర్ జిల్లాతో సంబంధంలేని బల్మూరి వెంకట్కు టికెట్ ఖరారుచేసింది. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్లో మొదటి నుంచి ఉన్న వారికి ప్రాధాన్యం దక్కట్లేదని పార్టీ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. హుజూరాబాద్ అభ్యర్థి ప్రకటనతో ఇది మరోసారి స్పష్టమైందని చెప్తున్నారు. బల్మూరి వెంకట్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి టికెట్ ఆశించారు. అప్పుడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్.. తనతోపాటు టీడీపీ నుంచి వచ్చిన మరో నేతకు టికెట్ దక్కేలా వ్యవహారం నడిపించడం గమనార్హం.
‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న’ చందంగా తయారైంది కాంగ్రెస్ పరిస్థితి. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు మేమే ప్రధాన పోటీ అంటూ గొప్పలకు పోయిన కాంగ్రెస్, అభ్యర్థి ఎంపికలో టీఆర్ఎస్ను కాపీ కొట్టింది. టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ను టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించగా.. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్కు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. మొన్నటి వరకు గెలుపే లక్ష్యంగా పెద్దల పేర్లను పరిశీలిస్తున్నామంటూ హడావిడి చేసిన కాంగ్రెస్.. చివరికి ఓ అనామకుడికి టికెట్ ఇవ్వడం గమనార్హం. హుజూరాబాద్లో ఓటమి ఖరారైన తథ్యమని తెలువడంతో రేవంత్రెడ్డి ఈటల రాజేందర్తో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈటలకు మేలు చేసేందుకు స్థానికేతరుడిని అభ్యర్థిగా ప్రకటించారని విమర్శలు వినిపిస్తున్నాయి.