MLC Kalwakuntla Kavitha | సీఎం రేవంత్ రెడ్డి ఆరెస్సెస్ సీఎంగా వ్యవహరిస్తున్నారని, ఆయన ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్షన్లో పనిచేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ప్రతీ విషయంలో బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తున్నారని, ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత బీజేపీ, కాంగ్రెస్ మధ్య దోస్తీ బట్టబయలైందని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దగ్గరుండి కాపాడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము ప్రజల్లో ఎండగట్టగానే బీజేపీ నాయకులు తమను విమర్శిస్తున్నారని, దీన్ని బట్టి ఆ రెండు జాతీయ పార్టీలు కలిసి పని చేస్తున్నట్లు తేటతెల్లమవుతోందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య భాగస్వామ్యం ఉందిని, అందులో భాగంగానే లేనిపోని విషయాలను తెచ్చి ఆ రెండు పార్టీల నాయకులు బీఆర్ఎస్కు అంటగడుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ‘న్యాయవాది సంజీవ రెడ్డి కోర్టులో వాదిస్తూ అందరి ముందే ఆరు నెలల క్రితమే గుండె పోటుతో మరణించారని, భూపాలపల్లిలో భూతగాదాల వల్లనే హత్య జరిగినట్లు జిల్లా ఎస్పీ చెప్పారని, దుబాయ్లో ఒక వ్యక్తి నిద్రలోనే చనిపోయారని పత్రికల్లోనే వచ్చిందని, మరి సీఎం రేవంత్ రెడ్డి సంబంధం లేని ఈ సంఘటనలను బీఆర్ఎస్కు ఎందుకు అంటగడుతున్నట్లు’ అని నిలదీశారు. ఇదంతా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా ఇది అని మండిపడ్డారు.
ప్రధానిని కలిసిన తర్వాత కేసీఆర్, కేటీఆర్పై కేసులు పెడుతామని రేవంత్ రెడ్డి అంటున్నారని, అంటే బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడమే తప్పా సీఎంకు ఇంకో ఆలోచన లేదని ధ్వజమెత్తారు. కల్వకుంట్ల కుటుంబం అంటే కట్టుబాట్లతో కూడిన కుటుంబమని తేల్చిచెప్పారు. తమ కుటుంబ సభ్యులెవరూ ఎప్పుడూ ప్రొటొకాల్ ఉల్లంఘించలేదని, కానీ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు. ప్రధానిని కలిసిన తర్వాత తన సోదరుడు తిరుపతి రెడ్డి తన నియోజకవర్గ ఇన్ చార్జి అని సీఎం చెప్పుకున్నారని, పార్టీ పరంగా ఇన్ చార్జి అయితే తమకు ఇబ్బంది లేదని, కానీ తిరుపతి రెడ్డి అధికారిక సమావేశాల్లో ఎందుకు పాల్గొంటున్నారని, తిరుపతి రెడ్డికి కలెక్టర్ ఎందుకు ఎదురెళ్లి స్వాగతం చెబుతున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగేతర శక్తులను ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నట్లు కదా ? అని నిలదీశారు. తమ కుటుంబంలోని ప్రజాప్రతినిధులు అధికారికంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో ఎన్నికయ్యి ప్రజాసేవ చేస్తున్నామని అని అన్నారు.
గుమ్మడి నర్సయ్య వంటి మహోన్నతమైన వ్యక్తిని గేటు బయట నిలబెట్టి రేవంత్ రెడ్డి అహంకారాన్ని ప్రదర్శించారని, అహంకారానికి, కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్రస్ ఎనుముల రేవంత్ రెడ్డి అని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా ఉన్న కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టాలన్నది సీఎం దురాలోచన అని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి తెలంగాణకు రక్షణకవచంగా ఉన్న బీఆర్ఎస్ పై కుట్రలు చేస్తున్నాయని తెలిపారు.
మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి అంతులేని అబద్ధాలు చెబుతున్నారని, గత ప్రభుత్వ అప్పులపై నెలకు రూ.6500 కోట్ల వడ్డీ కడుతున్నామని సీఎం అబద్దాలు చెబుతున్నారని, కాగ్ నివేదిక ప్రకారం ఏ నెల కూడా ప్రభుత్వం రూ. 2600 కోట్లకు మించి వడ్డీ కట్టలేదని చెబితే.. మరి రూ 6500 కోట్లు కడుతున్నామని సీఎం ఎందుకు అబద్దాలు చెబుతున్నారు ? అని అడిగారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కనీసం ఇప్పుడైనా నిజాలు చెప్పాలని సూచించారు. అబద్దాలు పదేపదే చెబితే నిజమవుతాయేమోనన్న భ్రమలో సీఎం ఉన్నారని, రాష్ట్ర ఆదాయంపై కూడా రేవంత్ రెడ్డి తప్పుడు లెక్కలు చెబుతున్నారని, ప్రతీ నెల 18 వేల కోట్ల ఆదాయం వస్తున్నదని సీఎం చెబుతున్నారని. కానీ కాగ్ ప్రకారం 12 వేల కోట్లకు మించి ఈ ఏడాది ఆదాయం రాలేదని వివరించారు. మరి ఈ అబద్దపు లెక్కలు ఎందుకు చెప్తున్నట్లు ? ఎవరిని మభ్యపెట్టడానికి చెబుతున్నారు ? అని ముఖ్యమంత్రిని నిలదీశారు.
రాష్ట్ర ఆదాయం పడిపోవడానికి ప్రధాన కారణం హైడ్రా అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.18 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసిందని, కానీ హైడ్రా విధ్వంసం వల్ల దాని ద్వారా ఆదాయం రూ.5800 కోట్లకు పడిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ పనులే జరగలేదని సీఎం పచ్చి అబద్దాలు చెబుతున్నారని, కానీ కేసీఆర్ విశాల హృదయం తెలవాలంటే ఎస్ఎల్బీసీ విషయంలో అర్థమవుతుందన్నారు.
‘రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ ప్రాజెక్టుపై కేసీఆర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ విషయంలో అప్పటి ప్రతిపక్ష నేత జానా రెడ్డిని ముందుపెట్టి కాంట్రాక్టర్కు 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చిన ఘనత కేసీఆర్ది. కరోనా తర్వాత కాంట్రాక్టరు పనులు చేపట్టలేమంటే మళ్లీ 100 కోట్లు ఇచ్చారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు 30 ఏళ్లలో ఈ ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చు రూ. 3340 కోట్ల. కానీ కేవలం 10 ఏండ్లలో కేసీఆర్ పెట్టిన ఖర్చు రూ 3890 కోట్లు. ఇంత ఖర్చు పెట్టి 11 కీమీ మేర టన్నెల్ తవ్వి పని చేస్తే సీఎం అబద్దాలు చెబుతున్నారు’ అని వ్యాఖ్యానించారు.
సొంత జిల్లాలో సొంత ఊరు పక్కన విపత్తు జరిగితే పట్టించుకోకుండా సీఎం ఢిల్లీ వెళ్లారని, ఎనిమిది మంది ప్రాణాలు చిక్కుకుంటే సీఎం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఉత్తరాఖాండ్లో టన్నెల్ లో కార్మికులు చిక్కుకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లి వాళ్లు ప్రాణాలతో బయటపడేవరకు అక్కడే ఉన్నారని గుర్తు చేశారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి దేని మీదా సోయి లేదని ధ్వజమెత్తారు. ఐరన్ లెగ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నాలుగు ప్రాజెక్టులు కొట్టుకుపోయాయని తెలిపారు. సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటికీ అతీగతీ లేదని, ఖమ్మం జిల్లాలో పెద్దవాగు మీద మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోతే ప్రభుత్వం స్పందించలేదని చెప్పారు. మెఘా కృష్ణా రెడ్డి కడుతున్న ప్రాజెక్టుల గురించి మాట్లావద్దన్నట్లు సీఎం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు ముఖ్యమా… కాంట్రాక్టర్లు ముఖ్యమా ? అని నిలదీశారు. సుంకిశాల ప్రాజెక్టు మీద ఒకరు ఆర్టీఐ పిటిషన్ వేస్తే దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి జవాబు ఇవ్వబోమని ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు.