Drug Peddler | హైదరాబాద్, జూన్28(నమస్తే తెలంగాణ): ‘డ్రగ్స్ రహిత తెలంగాణగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతాం’ అని రోజుకో వేదికపై ప్రకటనలు గుప్పించే సీఎం రేవంత్రెడ్డి.. తన పాలనలో అదే డ్రగ్స్ కేసుల్లో నిందితులను అం దలం ఎక్కిస్తున్నారు. కొకైన్ కేసులో నిందితుడికి ఏకంగా ప్రభుత్వ కాంట్రాక్ట్ను అప్పగించారు. గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లకు ట్రంకు పెట్టెలు సరఫరా చేసే కాంట్రాక్టును ప్రభుత్వం అంతర్జాతీయ డ్రగ్స్ కేసు నిందితునికి అప్పగించింది. ఎవరికీ, ఎక్కడ ఎటువంటి సంబంధం కుదిరిందో కానీ..డ్రగ్ పెడ్లర్కు రెడ్కార్పెట్ పరిచి బడిపిల్లల మధ్యకు రప్పించడం ఆందోళన కలిగిస్తున్నది.
హైదరాబాద్ నగరాన్ని ఒకప్పుడు ఉలిక్కిపడేలా చేసిన నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ టోనీ కేసు లో హిమాయత్నగర్కు చెందిన ప్రముఖ వ్యా పారవేత్త నిందితుడిగా ఉన్నారు. రూ.1,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఉన్న ఈయన.. టోనీ నెట్వర్ ద్వారా దాదాపు 30 సార్లు భారీ మొత్తంలో కొకైన్ కొనుగోలు చేసినట్టు అప్పట్లోనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో ఎఫ్ఐఆర్ (10/2022) నమోదైన ఈ కేసులో ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 8 (సీ) ఆర్/డబ్ల్యూ 20 (బి) (ii) (సీ), 27 అండ్ ఫారినర్స్ 1946 చట్టంలోని సెక్షన్ 14 (ఏ) (బీ) కింద కేసులు నమోదు చేశారు. తాను డ్రగ్స్కు అలవాటుపడిన వ్యక్తినని అతనే స్వయంగా అంగీకరిస్తూ తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇంతటి వివాదాస్పద నేపథ్యం ఉన్న వ్యక్తికి తెలంగాణ ప్రభుత్వం ఏకంగా గురుకుల పాఠశాలల విద్యార్థుల కోసం 2.68 లక్షల ట్రంకు పెట్టెల ఉత్పత్తి, సరఫరా బాధ్యతలను అప్పగించింది.
తక్కువ ధరకే ట్రంక్ పెట్టెలను ఉత్పత్తి చేయగలిగే చిన్నతరహా కంపెనీలు రాష్ట్రంలో వందల సంఖ్యలో ఉన్నాయి. ప్రస్తుతం బయటి మార్కెట్లో రూ.400 నుంచి రూ.600 ధరకు విద్యార్థులకు అవసరమైన ట్రంక్ పెట్టెలు లభిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తాను ఇవ్వదలుచుకొన్న వ్యక్తికి టెండర్ దక్కే విధంగా టెండర్ విధివిధానాలు రూపొందించినట్టు సమాచారం. ట్రంక్ బాక్సుల సరఫరా టెండర్లో పాల్గొనాలంటే రూ.30 కోట్ల భారీ బ్యాంక్ గ్యారెంటీ చూపించాలనే షరతు విధించారు. రూ.5 కోట్ల ఈఎండీ సమర్పించాలని, రూ.10 కోట్ల టర్నోవర్ కలిగి ఉండాలనే నిబంధనలు అమల్లోకి తెచ్చారు. అంత డబ్బు ప్రభుత్వానికి జమ చేసి 45 రోజుల్లో మెటీరియల్ ఇవ్వడం చిన్న తరహా పరిశ్రమల యాజమాన్యాలకు సాధ్యంకాదనే ఆ లోచనతో ఇటువంటి కఠిన నిబంధనలు అమ ల్లోకి తెచ్చినట్టు సమాచారం. ఈ అసాధారణ ఆర్థిక షరతుల వల్ల స్థానిక, మధ్య తరహా కంపెనీలు టెండర్లలో పాల్గొనలేక వెనుదిరిగాయి. ప్రభుత్వం పెట్టిన ఈ కఠిన నిబంధనలకు అనుగుణంగా చింతామణి పా ర్శనాథ్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ మాత్రమే టెండర్ వేసింది. ఏటా దాదాపు 26,893 ట్రంక్ పెట్టెలు సరఫరా చేసే విధంగా టెండర్ ఖరారు చేసినట్టు తెలిసింది.
పసిపిల్లల అవసరాలకు సంబంధించిన కాంట్రాక్టులను ఇచ్చేటప్పుడు సదరు వ్యక్తుల నేపథ్యం చూడాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ, రేవంత్రెడ్డి ప్రభుత్వం నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ టోనీ కేసులో దొరికిన నిందితునికి కాంట్రాక్టు ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. పీఎంయూ టెండర్లు, విధివిధానాల రూపకల్పన కోసం సీఎం స్వయంగా సమీక్ష సమావేశం నిర్వహించినట్టు చెప్తున్నారు. ముఖ్యమంత్రితో అతి సన్నిహితంగా ఉండి, ప్రతినిత్యం ఆయనకు గమన నిర్దేశం చేసే నాయకుడి కనుసన్నల్లో ఈ టెండర్లు పూర్తయినట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రతిపక్ష నేతలపై తీవ్రమైన డ్రగ్స్ ఆరోపణలు చేసిన సీఎం రేవంత్రెడ్డి.. ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ డ్రగ్ ముఠాతో సంబంధం ఉన్న వ్యక్తికి ప్రభుత్వ కాంట్రాక్టు అప్పజెప్పడం వెనుక ఉద్దేశం ఏందని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.