జనగామ, జూలై 7 (నమస్తే తెలంగాణ) : బెనిఫిట్స్ అందక ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన జనగామ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకున్నది. తన చావుకు డబ్బులు తీసుకొని ఎగ్గొట్టిన తన బంధువులతోపాటు తనకు సరైన న్యాయం చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, హైకోర్టు జడ్జి బాధ్యులంటూ రాసిన ఇరువై పేజీల సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది. బాధితుడి కుటుంబ సభ్యుల కథనంతోపాటు సూసైడ్ నోట్లో పేర్కొన్న అంశాల ప్రకారం వివరాలు ఇలా.. జనగామ జిల్లా కేంద్రంలోని పూర్ణిమకాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పగిడిపల్లి మల్లయ్య 31 ఆగస్టు 2024న ఉద్యోగ విరమణ పొందాడు. ఆయనకు ప్రభుత్వం నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బులు రూ.56,33,435తోపాటు జీతం నుంచి నెలనెలా జడ్పీ జీపీఎఫ్ ఖాతాలో పొదుపు చేసిన రూ.10,77,528తో కలిపి మొత్తం రూ.67,10,963 రావాల్సి ఉన్నది. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం చెల్లించకపోవడంతో కొద్ది నెలల క్రితం హైకోర్టును ఆశ్రయించాడు.
రిటైర్మెంట్ బెనిఫిట్, జీపీఎఫ్ సొమ్ము చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించినా అధికారులు నెలల కొద్దీ జాప్యం చేస్తుండటంతో పలుమార్లు తిరిగి విసిగి వేసారిన ఆయన కోర్టు ఆదేశాలు పాటించడంలేదని ప్రభుత్వంపై కోర్టు ధిక్కారం కింద మరో కేసు వేశాడు. దిగివచ్చిన ప్రభుత్వం చివరికి కొద్ది నెలల క్రితం రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.45,55,897 చెల్లించినా మిగతా రూ.10,77,538 బిల్లు పెండింగ్లో పెట్టగా, జీపీఎఫ్ డబ్బులు కూడా రావాల్సి ఉన్నది. కాగా మరోవైపు సమీప బంధువులకు రూ.1.44 కోట్లు సాయం చేసినా సొమ్ము తిరిగి రాలేదు. ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రయోజనాలు పెండింగ్లో ఉండటం.. కోర్టు కేసులు, ఇతరత్రా అవసరాల కోసం అధిక వడ్డీలతో తెచ్చిన అప్పులు చెల్లించకలేక వారి ఒత్తిడి భరించలేక తీవ్ర మనస్తాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు గుంటి రత్నాకర్, గుంటి మనోహర్, రాధమ్మ, జయమ్మ (జయశ్రీ), వీణ ప్రధాన కారకులుగా పేర్కొంటూ అప్పుల వివరాలను స్టాంప్ పేపర్తోపాటు దానికి అనుబంధంగా 20 పేజీల మరణ వాంగ్మూలం రాసి మీడియాకు వెల్లడించాలని కూడా పేర్కొన్నాడు. విశ్రాంత ఉపాధ్యాయుడి ఆత్మహత్య ఉదంతంపై జనగామ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.