హైదరాబాద్ : తెలంగాణలో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులను ( Retired employees ) ఇబ్బందులపాలు చేస్తున్న కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వానికి ఉసురు తగులుతుందని ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ నేత , కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి దేవీ ప్రసాద్ ( G Devi Prasad) పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉద్యోగులు,ఉపాధ్యాయుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని, ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగులకు 5 డీఎలు పెండింగ్లో ఉన్నాయని,సీపీఎస్ రద్దుపై ఇప్పటి వరకు కమిటీ వేయలేదని విమర్శించారు.ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డులు ఏమయ్యాయని ప్రశ్నించారు.
రిటైర్డ్ ఉద్యోగులు 86 మంది చనిపోయారని,రిటైర్డ్ ఉద్యోగులకు చావు పరిష్కారం అయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ. 14 వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగుకు హైకోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోయిన రిటైర్డ్ ఉద్యోగులకు కోటి 20 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల్లో ఆంధ్రా పెత్తనం నడుస్తోందని, ఎక్సైజ్ శాఖలో కమీషనర్ వేధింపులు తట్టుకోలేక తెలంగాణ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశారని వెల్లడించారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య సోదర బంధం ఉందని, బీజేపీ రాజకీయంతోనే మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లు ఆగిపోయింది డీలిమిటేషన్, మహిళా బిల్లును లింక్ చేశారని ఆరోపించారు.
టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ మాట్లాడుతూ 30 ఏళ్లుగా మహిళా బిల్లును కాంగ్రెస్, బీజేపీ అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల అమలు కావడం బీజేపీకి ఇష్టం లేదని అన్నారు. ఉపాధ్యాయ సంఘం మాజీ నాయకులు భుజంగ రావు తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.