హైదరాబాద్, జనవరి 9(నమస్తే తెలంగాణ) : ట్రిపుల్ఆర్ దక్షిణ భాగం సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్) తయారీకి కన్సల్టెంట్ నియామకం కోసం రోడ్లు భవనాల శాఖ టెండర్లు ఆహ్వానించింది. డీపీఆర్ తయారీ కోసం గత నవంబర్ 25న గ్లోబల్ టెండర్లు పిలిచినా కన్సల్టెంట్ సంస్థలు ముందుకు రాలేదు. దీంతో తాజాగా గురువారం రీటెండర్ ఆహ్వానించినట్టు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 9వరకు టెండర్లకు గడువు ఇచ్చారు. నాలుగు లేన్ల ఎక్స్ప్రెస్ వే నిర్మించాలని నిర్ణయించారు. ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం పనులకు ఇప్పటికే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) టెండర్లు ఆహ్వానించిన విషయం తెలిసిందే. దక్షిణ భాగం పనులను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టాలని ముందు భావించినప్పటికీ.. ఇటీవల ఆ పనులను సైతం ఎన్హెచ్ఏఐ ద్వారానే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో డీపీఆర్ తయారుచేసి కేంద్రానికి సమర్పించాల్సి ఉంది. వాస్తవానికి ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగానికి గతంలో రూపొందించిన అలైన్మెంట్లో మార్పులు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా డీపీఆర్ తయారీకి టెండర్లు ఆహ్వానించారు. దక్షిణ భాగం చౌటుప్పల్, షాద్నగర్ మీదుగా సంగారెడ్డి వరకు సుమారు 182.23 కిలోమీటర్లు ఉంటుంది.