హైదరాబాద్: శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం కేవలం ఇంగ్లిష్ ద్వారానే సాధించవచ్చనే అపోహలను వీడి మాతృభాషతోనే పరిశోధనలు కొనసాగిస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చని రాష్ట్ర ప్రణాళిక విభాగం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోదవ్ కుమార్ అన్నారు.పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వ్యవస్థాపదిన్సోతవం సందర్భంగా ఎన్టీఆర్ కళామందిరంలో విశిష్ట పురస్కారాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు మాతృభాషను ఎవరూ మరిచిపోరాదని, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు తెలుగువారికి జీవనాడులని పేర్కొన్నారు. పాశ్చాత్య శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను మాతృభాషలోనే చేశారని వివరించారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయంలోని ఖాళీగా ఉన్న ఉద్యోగాలతో పాటు అదనంగా మరో వెయ్యి ఉద్యోగాలను నియమించడానికి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.
సాంస్కృతిక సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయం కోర్సులు కేవలం స్వయం ఉపాధికే పరిమితం కాకుండా, ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించే విధంగా కోర్సులను రూపొందించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. అనంతరం 2020 సంవత్సరానికిగాను సాహిత్యరంగం నుంచి ప్రముఖ సాహితీవేత్త, రచయిత డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి, 2021 సంవత్సరానికిగాను సాంస్కృతిక రంగం నుంచి ప్రసిద్ధ సంగీత రికార్డుల సేకర్త, సంగీత, సాహిత్య, నృత్య కళా విమర్శకులు వి.ఎ.కె. రంగారావులకు విశిష్ట పురస్కారాలను అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఆచార్య తంగెడ కిషన్ రావు, విశ్వవిద్యాయ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్ పాల్గొన్నారు.