హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ సమర్పించే ప్రాథమిక నివేదిక ఆధారంగానే మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణకు చర్యలు చేపడతామని రాష్ట్ర సాగునీటి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సాధ్యమైనంత త్వరగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని, వానకాలంలోగా మేడిగడ్డ బరాజ్కు చేపట్టాల్సిన తాత్కాలిక మరమ్మతులను సిఫారసు చేయాలని నిపుణుల కమిటీకి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన జలసౌధలో కమిటీతో ప్రత్యేక భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. బరాజ్ కుంగుబాటుకు కారణాలను అన్వేషించాలని, అవసరమైతే అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలని చెప్పామని తెలిపారు. ఆ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. ఎన్డీఎస్ఏ కమిటీకి అన్నివిధాలా సహకరించాలని, వారు కోరిన పత్రాలన్నీ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఏవైనా డాక్యుమెంట్లను దాచిపెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేడిగడ్డ బరాజ్ను వర్షాకాలానికి ముందే అందుబాటులోకి తీసుకువస్తే బావుంటుం దన్నారు. నిర్మాణ లోపాలు తేలితే నిర్మాణ సంస్థ, అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
బీజేపీ ఎందుకు విచారణ చేయలేదు?
ఇటీవల ఆదిలాబాద్ సభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ ఘాటుగా స్పందించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగితే బీజేపీ ఎందుకు విచారణ చేయించలేదని ప్రశ్నించారు. విభజన హామీలను నెరవేర్చకపోగా 7 మండలాలను ఏపీలో విలీనం చేసిందని, సీలేరు పవర్ ప్లాంట్ను లాగేసుకున్నదని, రూ.50 లక్షల కోట్ల విలువైన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసిందని నిప్పులు చెరిగారు.