వరంగల్, జూలై 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ఉత్తరప్రదేశ్లో సాయంత్రం ఏడు దాటితే మహిళలు బయటికెళ్లరు. భయంతో ఇంట్లోనే ఉండిపోతరు. సీఎం యోగి నియోజకవర్గంలో కూడా రోడ్లు బాగలేవ్. అంతా బురద. అక్కడి ప్రజలు మంచినీళ్లకు గోస పడుతున్నరు. అక్కడ పింఛన్ ఐదొందలే ఇస్తున్నరు. డబ్బుల పొదుపు, సంఘాలపై అక్కడి మహిళలు అవగాహన లేదు. మన తెలంగాణ లెక్క పథకాలు లేవు. వసతులు కూడా లేవు. మహిళా సంక్షేమం మాటే లేదు. ఆయా రాష్ర్టాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి’ అని తెలంగాణకు చెందిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు వెల్లడించారు.
వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన పది ఉత్తమ ప్రగతి సాధించిన ఆదర్శ సంఘాలతో కలిపి ఓరుగల్లు పరస్పర సహాయక సహకార మహా సమాఖ్యగా ఏర్పడింది. 18 ఏండ్లుగా ఈ సమాఖ్య పని చేస్తున్నది. ఈ సమాఖ్య 2015లో జాతీయ స్థాయిలో ఏకైక మానవ వనరుల సంస్థగా జాతీయ గుర్తింపు పొందింది. ఈ సంస్థలోని 460 మంది రిసోర్స్పర్సన్స్ శిక్షణ పొంది, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇటీవల జమ్ముకశ్మీర్లోని లఢక్లో 65 రోజులపాటు ఉండి శిక్షణ ఇచ్చి వచ్చారు. ఆ మహిళలతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శనివారం వరంగల్లో ముఖాముఖి నిర్వహించారు. వివిధ రాష్ర్టాల్లో శిక్షణ ఇవ్వడానికి వెళ్లిన మహిళలు తమ అనుభవాలను పంచుకున్నారు.
అన్ని రంగాల్లో తెలంగాణ టాప్లోనే
దేశంలో పదుల సంఖ్యలో రాష్ర్టాలు తిరిగినా అన్ని రకాలుగా తెలంగాణ ముందున్నదని మహిళలు ఘంటాపథంగా చెప్పారు. ఏ రాష్ట్రంలోనూ తెలంగాణలో ఉన్నటువంటి వసతులు, పథకాలు, సంక్షేమం లేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లో మహిళా సంక్షేమ పథకాలు తెలంగాణలో తరహాలో లేవని తెలిపారు. ఛత్తీస్గఢ్లో కల్యాణలక్ష్మి పథకం లేదని, అక్కడ పింఛన్ ఐదారొందల రూపాయలే ఉన్నదని చెప్పారు. ఛత్తీస్గఢ్లో పొదుపుపై మహిళలకు ఇంకా అవగాహన కల్పించలేదని చెప్పారు.
మీ పనితీరు అద్భుతం
శభాష్ ! మీ పనితీరు అద్భుతం. మీ అనుభవాలను, నిర్వహణ సామర్థ్యాలతో దేశంలోని మిగతా మహిళా సంఘాలకు ఇస్తున్న శిక్షణ గొప్పగా ఉన్నది. ఇంత గొప్ప కార్యాన్ని నిర్వర్తిస్తూ, దేశానికే ఆదర్శంగా నిలిచిన మహిళా మణులందరికీ అభినందనలు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో 4,35,364 స్వయం సహాయక సంఘాలు ఏర్పడ్డాయి. ఈ సంఘాల్లో 45,60,518 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. మహిళలు ఇంత పెద్ద సంఖ్యలో సంఘటితమైనది దేశంలోనే ఎక్కడా లేదు.
– దయాకర్రావు, పంచాయతీరాజ్శాఖమంత్రి
యూపీలో పరిస్థితి దారుణం
యూపీ సీఎం యోగి సొంత నియోజకవర్గం గోరఖ్పూర్ అర్బన్లోనూ శిక్షణ ఇచ్చిన. అక్కడ రోడ్లు సరిగా లేవు. బురద ఉన్నది. నీళ్లకు గోస ఉన్నది. తాగునీటి వసతులు లేవు. మహిళలు మన కంటే బాగా వెనుకబడ్డరు. పంజాబ్ కంటే మన ఊర్లే మెరుగ్గా ఉన్నయి.
-జీ రేణుక, వడిచర్ల, లింగాలగణపురంమండలం, జనగామ జిల్లా
అక్కడ మహిళా సంఘాల్లేవ్
లఢక్లో శిక్షణ ఇచ్చేందుకు వెళ్లాము. అక్కడ మ హిళా సంఘాల్లేవు. అక్కడ బ్యాంకులు బాగా దూరంగా ఉన్నాయి. తెలంగాణలోని విషయాలను చెబితే వారు ఆశ్చర్యపోతున్నారు. ఛత్తీస్గఢ్లో కూడా మహిళా సంఘాలు లేవు.
– ఎండీ జమీలా, వేలేరు, హనుమకొండ జిల్లా