Telangana | హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): తాగునీరు కోసం మహారాష్ట్ర, కర్ణాటక వెంట పరుగులు తీస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అధికారులు విస్తుపోతున్నారు. ప్రభుత్వ ఆంతర్యం ఏమిటో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నాయని, వాటితో రాష్ట్ర అవసరాలు తీరుతాయని అధికారులు చెప్తున్నా మంత్రుల బృందం మాత్రం త్వరలోనే కర్ణాటక పర్యటనకు సిద్ధమవుతున్నది.
రాష్ర్టానికి ఏడాది పొడవునా తాగునీటి అవసరాలకు కృష్ణాబేసిన్లో 43.94 టీఎంసీలు అవసరమవుతాయి. వీటిలో హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 16.5 టీఎంసీలు, పబ్లిక్ యుటిలిటీ కోసం 4టీఎంసీలు అవసరం కాగా, సాగర్ కింద 11.69 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. రాబోయే ఆరునెలల కాలానికి 21.97టీఎంసీలు అవసరం. శ్రీశైలం ప్రాజెక్టుల్లో తాగునీటి అవసరాలకు సరిపోను జలాలతోపాటు మిగులు జలాలు అందుబాటులో ఉన్నాయి.
సాగర్, శ్రీశైలంలో 82.78 టీఎంసీలు
సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో 82.78 టీఎంసీలు వినియోగానికి అందుబాటులో ఉన్నాయని తేల్చి అందులో 35 టీఎంసీలు తెలంగాణకు, 45 టీఎంసీలు ఏపీకి కేఆర్ఎంబీ ఇప్పటికే కేటాయించింది. తెలంగాణకు కేటాయించిన నీటిలో ప్రస్తుతం 8టీఎంసీలు వినియోగానికి ఇంకా అందుబాటులో ఉన్నాయి. ఏపీకి శ్రీశైలం కింద 30, సాగర్ కింద 15 మొత్తంగా 45 టీఎంసీలను కేఆర్ఎంబీ కేటాయించింది. శ్రీశైలంలో నీటిని వినియోగించుకోలేకపోతున్నామని చెప్తూ ఏపీ సర్కారు సాగర్ ప్రాజెక్టును ఆక్రమించడం, తదనంతర పరిణామాలతో సాగర్ ద్వారా 5 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు కేఆర్ఎంబీ అనుమతినిచ్చింది.
మరోవైపు, శ్రీశైలంలో 826 అడుగుల వద్ద మొత్తంగా 45.61టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. అందులో 800 అడుగుల వరకు వెళ్లినా ఇంకా 16 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని అధికారుల అంచనా. ఏపీని సంప్రదించి, కేఆర్ఎంబీని ఒప్పించి జలాలను దిగువన సాగర్కు విడుదల చేయించుకునే అవకాశముంది. అదే సమయంలో విద్యుదుత్పత్తి కూడా చేసుకోవచ్చు. అయినా తెలంగాణ సర్కారు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. సుదూరంలో ఉన్న కొయినా డ్యాం నుంచి నీళ్లు తెచ్చుకునేందుకు మహారాష్ట్ర, కర్ణాటకతో సంప్రదింపులు జరుపుతామంటున్నదని కానీ, అధికారుల చెప్తున్న అంశాలపై ఎందుకు దృష్టిసారించడం లేదన్నది ఎవరికీ అంతుపట్టని విషయంగా మారింది.
జూరాల, సింగూరులోనూ
సాగర్ ద్వారా హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. నగర అవసరాలకు 16.5 టీఎంసీలు అవసరం. ఆరు నెలల కాలానికి 8 టీఎంసీలకు పైగా కావాలి. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 526 అడుగులు కాగా, 152 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ 505 అడుగుల వద్ద 123 టీఎంసీలను మాత్రమే పరిగణలోకి తీసుకుని ఇరు రాష్ర్టాలకు జలాలు కేటాయించింది. సాగర్లో 490 అడగుల డెడ్స్టోరేజీ వరకు వెళ్లి వినియోగించుకునే అవకాశముంది. అంటే మరో 23టీఎంసీలు సాగర్లోనే అందుబాటులోనే ఉండనున్నాయి.
గతంలో ఇలా వినియోగించుకొన్న సందర్భాలు కోకొల్లలు. సింగూరు ప్రాజెక్టులో 29 టీఎంసీల సామర్థ్యానికి గాను 24 టీఎంసీలకు పైగా అందుబాటులో ఉన్నాయి. సాగునీటి అవసరాలు పోయినా దాదాపు 20 టీఎంసీలు ఇంకా అందుబాటులో ఉండే అవకాశముంది. శ్రీశైలం కింద కల్వకుర్తి తదితరాల అవసరాలకు సరిపోయే విధంగా ఎగువన జూరాలలో కూడా నీరు అందుబాటులో ఉంది. జూరాల పూర్తిస్థాయి సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.15 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. ఇన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వాటిపై దృష్టి సారించకుండా పొరుగు రాష్ర్టాల వెంటపడడంలో ఆంతర్యమేంటో అంతుచిక్కడం లేదు.
కొయినా నీళ్ల కోసం సీఎంవోకు ప్రతిపాదనలు
రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టని ప్రభుత్వం మహారాష్ట్రలోని కొయినా డ్యాం నుంచి నీటిని తెచ్చుకోవాలని భావిస్తున్నది. కొయినా సామర్థ్యం 100 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 67 టీఎంసీలున్నాయి. అందులో 37టీఎంసీలను ఆ రాష్ట్రం సాగు, తాగునీటి అవసరాలను కేటాయించుకోగా, మిగిలిన 30 టీఎంసీలను జలవిద్యుత్తు కోసం వాడుకోవాల్సి ఉంది. విద్యుదుత్పత్తి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం దాచుకున్న నీటిని విడుదల చేస్తే ఆ మేరకు పరిహారం ఇస్తామని చెప్తున్న తెలంగాణ ప్రభుత్వం అందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సాగునీటిశాఖ అధికారులను ఆదేశించింది. తాజాగా, ఆ ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి.
తమకు కొయినా నీళ్లిస్తే ప్రతిగా డబ్బులు ఇస్తామని ప్రతిపాదించినట్టు తెలిసింది. జలవిద్యుత్తు ద్వారా వచ్చే ఆదాయాన్ని తామే సమకూర్చుతామని చెప్పి ‘మహా’ ప్రభుత్వాన్ని ఒప్పించాలని నిర్ణయించినట్టు సమాచారం. మహారాష్ట్ర ప్రభుత్వం ఒక టీఎంసీ నీటితో 40 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుండడంతో ఆమేరకు లెక్కకట్టి అంచనాలు తయారుచేశారు. యూనిట్కు రూ.4 నుంచి రూ. 8 వరకు ఆయా స్లాబుల ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది.
అందేవి సగం నీళ్లే!
మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరి కొయినా నుంచి నీళ్లు విడుదలైనా సాగర్కు చేరుకునేది మాత్రం సగం నీళ్లేనని చెప్తున్నారు. దాదాపు 50 మేరకు నీటి సరఫరా నష్టాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ పూర్తినీటికి సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం అడిగిన ప్రతిపాదనలతోపాటు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా అధికారులు ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలిసింది. ప్రభుత్వం మాత్రం వీటిని పట్టించుకోకుండా ముందుకే వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. అందులో భాగంగా మంత్రుల బృందం త్వరలోనే కర్ణాటకలో పర్యటిస్తుందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు.