హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో వాదప్రతివాదనలు ముగిశాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ను రద్దు చేసి తిరిగి నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను గురువారం జస్టిస్ పీ మాధవీదేవి విచారణ పూర్తి చేశారు. తీర్పును రిజర్వులో పెడుతున్నట్టు వెల్లడించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గిరిధర్రావు, టీఎస్పీఎస్సీ తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు.
గ్రూప్ -1 ప్రిలిమ్స్ నిర్వహణకు కమిషన్ అన్ని పకడ్బందీ చర్యలు తీసుకొన్నట్టు ఏజీ చెప్పారు. బయోమెట్రిక్ తీసుకోలేదన్న ఆరోపణ సరికాదని పేర్కొన్నారు. కోర్టుకు వచ్చిన ముగ్గురు అభ్యర్థులు తప్ప ప్రిలిమ్స్ రద్దు చేయాలని ఇతరులెవరూ కోరలేదన్నారు. పిటిషనర్లు ముగ్గురి కోసం లక్షల మంది అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని చెప్పారు. పిటిషన్ను కొట్టివేయాలని, ఫలితాలు వెల్లడించేందుకు మెయిన్ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని ఏజీ కోరారు.