హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల విక్రయాల ద్వారా మరో రూ.1,000 కోట్లు సమీకరించుకొనేందుకు భారత రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) సోమవారం అనుమతి ఇచ్చింది. 15 ఏండ్ల కాల పరిమితితో రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణాన్ని పొందింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం సమీకరించిన రుణాల మొత్తం రూ.11,500 కోట్లకు చేరింది. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.53,970 కోట్ల మేర రుణాలను సమీకరించాలని రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, ఆదిలోనే వివిధ రకాల సాకులతో ఈ ప్రయత్నాలను అడ్డుకొనేందుకు కేంద్రం ప్రయత్నించింది. దీంతో తొలి రెండు నెలల్లో తెలంగాణ రాష్ట్రం రూ.8 వేల కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో రాష్ట్ర బృందం అనేకసార్లు ఢిల్లీ వెళ్లి అధికారులతో చర్చలు జరిపింది. దీంతో కేంద్రం దిగొచ్చింది. తాజాగా తెలంగాణతో పాటు మరో ఏడు రాష్ర్టాలు రూ.13,800 కోట్ల మేర రుణాలు సమీకరించుకొనేందుకు ఆర్బీఐ అనుమతించింది.