నాగర్కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో (SLBC Tunnel) మరో మృతదేహం ఆనవాళ్లు లభించాయి. తవ్వకాలు జరుపుతుండగా లోకో ట్రాక్ వద్ద మృతదేహం ఆనవాళ్లు లభించినట్లు తెలుస్తున్నది. దుర్వాసన వస్తున్నట్లు గుర్తించిన సిబ్బంది.. ఆ ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం. అనుమానిత ప్రాంతాలు డీ1, డీ2 కాకుండా మరోచోట తవ్వకాలు జరుపుతుండగా ఈ మృతదేహం ఆనవాళ్లు లభించాయి.
కాగా, దీనిని అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. ఈ నేపథ్యంలో అధికారులు టన్నెల్ లోపలికి వెళ్లారు. ఆనవాళ్లు మృతదేహానివే అయితే సాయంత్రం బయటకు తీసుకొచ్చే అవకాశం ఉన్నది. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ఘటనలో 8 మంది కార్మికులు గల్లంతైన విషయం తెలిసిందే. ఘటన జరిగి నెల రోజులు గడుస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు ఒకరి మృతదేహం మాత్రమే లభ్యమైంది. కేరళ నుంచి వచ్చిన క్యాడవార్ డాగ్స్ సాయంతో అనుమానిత ప్రాంతాలను గుర్తించి తవ్వకాలు జరుపగా టీబీఎం(టన్నెల్ బోర్ మెషిన్) ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహం లభించింది. మిగిలిన ఏడుగురి కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్పై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టన్నెల్లో అన్వేషణ కొనసాగించలేమని రెస్క్యూ అధికారులు తేల్చిచెప్పినట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో టన్నెల్ పైకప్పు బలహీనంగా ఉన్నదని, అది కూలిపోయే అవకాశం ఉన్నదని, మొండిగా ముందుకెళ్తే రెస్క్యూ కార్మికు లు మరో ప్రమాదంలో చిక్కుకునే ప్రమాదం పొంచి ఉన్నదని అధికారులు సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అయితే గల్లంతైన ఏడుగురి ఆచూకీ లభించేవరకు అన్వేషణ కొనసాగాల్సిందేనని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలిసింది.