అచ్చంపేట, మార్చి 13 : దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఏడుగురి జాడకోసం కేంద్ర, రాష్ట్ర విభాగాలకు చెందిన 12 సంస్థలు 4 షిఫ్టులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. కేరళ క్యాడవర్ డాగ్స్, జీపీఆర్ రాడార్ గుర్తించిన డీ1, డీ2 ప్రదేశాల్లో దుర్వాసన వస్తున్నా మృతదేహాల ఆచూకీ మాత్రం లభించలేదు. అన్వి రోబోటిక్స్కు చెందిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను ప్రమాద ప్రదేశానికి పంపించారు. దక్షిణమధ్య రైల్వేకు చెందిన ప్లాస్మా కట్టర్స్, థర్మల్ కట్టర్స్ బృందాలు టన్నెల్ బోరింగ్ మిషన్ ప్లాట్ఫాంను కత్తిరించి పరికరాలను లోకో ట్రైన్ ద్వారా బయటికి పంపిస్తున్నారు.
డీ1,డీ2 ప్రాంతాల్లో సింగరేణి, ర్యాట్ మైనర్స్ బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్, కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ పురోగతిపై సమీక్షించారు.