Shiva Balakrishna | నాంపల్లి కోర్టులు, జనవరి 30 (నమస్తే తెలంగాణ): ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో నిందితుడు, హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ ప్లానింగ్ అధికారి, హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్, రెరా కార్యదర్శి శివబాలకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. హెచ్ఎండీఏ మెట్రో పాలిటన్ కమిషనర్ దాన కిశోర్ ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడు చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
మరోవైపు శివబాలకృష్ణను ఎనిమిది రోజుల ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. పది రోజులు తమ కస్టడీకి ఇ వ్వాలని ఏసీబీ పీపీ కోర్టును కోరగా, 8 రోజుల కస్టడీకి అప్పగిస్తూ జడ్జి మహ్మద్ అఫ్రోజ్అక్తర్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. నిందితుడిని బుధవారం జైలు నుంచి ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారించనున్నారు. రాజకీయకోణంతోపాటు అవినీతి వెనుక ఉన్న వ్యక్తుల గురించి ఆరా తీయనున్నారు. రాజేంద్రనగర్లోని బాలకృష్ణ నివాసం లో రూ.99,60,850, నగదు, 1,988 గ్రాముల బంగారు ఆభరణాలు, 6 కిలోల వెండిని ఏసీబీ అధికారులు సీజ్చేసినట్టు పీపీ గుర్తు చేశారు. నిందితుడి తరఫు బంధువులు, స్నేహితులు, ఇతర సంస్థలతోపాటు 16 ప్రాంతాల్లో సోదాలు జరిపి కీలక పత్రాలతోపాటు రూ.5,96,27,495 విలువైన స్థిరాన్ని గుర్తించినట్టు తెలిపారు. నిందితుడు పొందిన ఆస్తుల గురించి విచారణ
చేపట్టనున్నారు.