హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఒక్క నెల జీతం రాకపోతేనే కుటుంబం ఆగమాగం అవుతుంది.. కానీ వీఆర్ఏలకు ఐదు నెలలుగా వేతనాలు లేవు. దీంతో దాదాపు 15వేల కుటుంబాలు ఐదు నెలలుగా పస్తులు ఉంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా? అంటే వచ్చింది.. కానీ రాలేదు అన్నట్టు.. వారి పరిస్థితి ‘త్రిశంకు స్వర్గం’లో ఊగిసలాడుతున్నది. రెవెన్యూ శాఖలోని వీఆర్ఏ వ్యవస్థను గత ప్రభుత్వం ఈ ఏడాది జూలైలో రద్దు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20,555 మంది వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తూ జూలై 24న ఉత్తర్వులు విడుదల చేసింది. వీరిలో దాదాపు 15వేల మంది ఆగస్టులో విధుల్లో చేరారు.
రెవెన్యూ శాఖకు చెందిన 30 మంది ఆఫీస్ సబార్డినేట్లు (ఓఎస్) వీఆర్ఏల క్రమబద్ధీకరణను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ముందుగా తమకు పదోన్నతులు కల్పించిన తర్వాతే వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని కోరారు. దీంతో న్యాయస్థానం ఆగస్టు 10న స్టే విధించింది. అప్పటి నుంచి వారికి వేతనాలు దక్కని పరిస్థితి. అయితే 30 మంది ఓఎస్లు తమ పిటిషన్ను వెనక్కి తీసుకొనేందుకు ఒప్పుకున్నారు. ఈ మేరకు న్యాయస్థానానికి తెలియజేశారు. దీంతో న్యాయస్థానం నవంబర్ మూడో వారంలో కేసును మూసివేసింది. వారికి ప్రభుత్వ ఉద్యోగులుగా ఐడీలు ఇచ్చి వేతనాలు అందించేందుకు అడ్డంకులన్నీ తొలిగిపోయాయి అనుకుంటుండగా.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
కోడ్ ఎత్తేసిన తర్వాత సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఇప్పటికే వీఆర్ఏలు సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డిని కలిసి తమ పరిస్థితిని వివరించారు. సమస్యను పరిష్కరించాలంటూ వినతిపత్రం అందజేశారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ తదితరులకు సైతం తమ పరిస్థితిని వివరించారు. 2023లో తమకు ప్రభుత్వ ఉద్యోగులుగా అవకాశం వచ్చిందని, అయినా ఐదు నెలలుగా పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు ఐడీలు ఇచ్చి, వేతనాలు అందించి, శుభవార్తతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించేలా చూడాలని కోరుతున్నారు.