హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పబ్లిక్గార్డెన్స్లో ఈ నెల 26న గణతంత్ర దినం వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు సీఎస్ శాంతికుమారి తెలిపారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వేడుకల్లో పాల్గొని, జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని వెల్లడించారు. బుధవారం ఆమె సచివాలయంలో వేడుకల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పకడ్బందీ బందోబస్తుకు, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాజ్భవన్, సచివాలయం, శాసనసభ, హైకోర్టు తదితర అన్ని ముఖ్యమైన ప్రభుత్వ భవనాలు విద్యుత్తు దీపాలతో అలంకరించాలని సూచించారు. నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా జరిగేలా చూడాలని తెలిపారు. అంబులెన్స్ను ఏర్పాటు చేయాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని ఆరోగ్యశాఖను ఆదేశించారు. పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని, ఆహ్వానితులందరికీ తాగునీటి సరఫరా చేపట్టాలని మున్సిపల్ శాఖను కోరారు. కార్యక్రమంలో డీజీపీ రవిగుప్తా, పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ రావు, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి, గవర్నర్ సెక్రటరీ సురేంద్ర మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, పోలీస్, డిఫెన్స్, ఆర్ అండ్ బీ, విద్యుత్తు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.