హైదరాబాద్, జులై 1(నమస్తే తెలంగాణ): ‘ఏండ్లు గడుస్తున్నా మా సమస్యలు తీర్చడం లేదు. గురువారం జరిగే క్యాబినెట్ భేటీలో మా సమస్యలపై చర్చించి, వారంలోగా పరిష్కారానికి చొరవ చూపాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లులను మూసివేసి ఆందోళనలకు దిగుతాం’ రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ స్పష్టంచేసింది. బుధవారం హైదరాబాద్లో రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు.
తమ సమస్యలపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం దక్కడం లేదని అసోసియేషన్ అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. అకౌంట్ సెటిల్మెంట్ చేసి మిల్లర్లకు వచ్చేవి ఉంటే ఇవ్వాలని, సివిల్ సైప్లెకి రావాల్సినవి ఉంటే వసూలు చేసుకోవాలని కోరారు. తమకు ఇచ్చే బకాయిలు ఇవ్వకుండా సివిల్సైప్లెకి వచ్చే నిధులను ముక్కుపిండి వసూలు చేయడం దారుణమని పేర్కొన్నారు. ఇప్పటికే రూ.4 వేల కోట్ల నుంచి 5వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని వివరించారు.
ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇప్పటికే సుమారు 1,000 మందికిపైగా మిల్లర్లు నష్టపోయి దివాలా తీశారని ఆందోళన వ్యక్తంచేశారు. మిల్లులు నడువక, బకాయిలు అందక, అధికారుల ఇబ్బందులు తాళలేక మిల్లర్లు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని తెలిపారు.మిల్లర్లంతా చెడ్డవాళ్లు కాదని, కొందరి అక్రమాలను అందరికీ ఆపాదించి ఇబ్బందులు పెట్టొద్దని సీఎం రేవంత్రెడ్డిని, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని గణపతిరెడ్డి కోరారు. మిల్లింగ్ వ్యవస్థలో జరిగే అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాచకొండ కిష్టయ్య, చల్లా శ్రీనివాస్రెడ్డి, శశికాంత్ పాల్గొన్నారు.