హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): దేశంలో ఏ సామాజిక వర్గానికి లేని క్రీమీలేయర్ను కేంద్రం బీసీలపై బలవంతంగా రుద్దిందని, దీన్ని వెంటనే రద్దుచేయాలని బీసీసంఘాలు డిమాండ్ చేశాయి. రద్దుకాని పక్షంలో క్రీమీలేయర్ ఆదాయ పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచాలని కోరాయి. నీట్ అడ్మిషన్లలో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ, ఏపీ బీసీ సంఘాల అధ్యక్షులు జాజుల శ్రీనివాస్గౌడ్, కేశనశంకర్రావు డిమాండ్ చేశారు. వీరి నేతృత్వంలో బీసీ ప్రతినిధు లు సోమవారం ఢిల్లీలోని శాస్త్రి భవన్లో కేంద్రమంత్రులు వీరేంద్రకుమార్, కిషన్రెడ్డిని కలిసి 12 డిమాండ్లతో వినతిపత్రం అందజేశారు. జనాభా లెకల్లో బీసీలను ప్రత్యేకంగా లెక్కించాలని, దేశ బడ్జెట్లో ఓబీసీలకు రూ.50 వేల కోట్లు కేటాయించాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, రిజర్వేషన్ల శాతాన్ని జనాభా దామాషా ప్రకారం పెంచాలని కోరారు. అంతకుముందు రాష్ట్రీయ ఓబీసీ మహాసభ జాతీయాధ్యక్షుడు బాబాన్రావు తావ్డే అధ్యక్షతన ఓబీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీలో ఓబీసీ గర్జన నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమం లో జాతీయ బీసీ కమిషన్ మాజీచైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, తెలంగాణ, ఆంధ్ర బీసీ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.