హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ ఎస్2 ఇంటిగ్రేటర్స్.. పాలమూరు ఐటీ టవర్లో యునిట్ను నెలకొల్పడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు శ్రీకాంత్ లింగిడి, శ్రీని సంతనంలు బుధవారం హైదరాబాద్లో మంత్రి శ్రీనివాస్గౌడ్తో సమావేశమై ఈ విషయంపై చర్చించారు. కొద్ది రోజుల క్రితం అమెరికాలో పర్యటించిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్తో సమావేశమైన కంపెనీ ప్రతినిధులు రాష్ట్రంలో యూనిట్ను నెలకొల్పనున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా మహబూబ్నగర్ ఐటీ టవర్లో ఏర్పాటు చేస్తున్న కార్యాలయం కోసం 100 మందికి సాఫ్ట్వేర్ ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని వారు వెల్లడించారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్న మంత్రి.. స్థానికంగా అర్హత కలిగిన యువతకు ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అమెరికా కంపెనీ ప్రతినిధులను కోరారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి అందుబాటులో ఉండటం.. అలాగే జాతీయ రహదారులు, స్థానికంగా సౌకర్యాలు అద్భుతంగా ఉండటం వల్ల మహబూబ్నగర్ ఐటీ టవర్లో తమ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్టు ఎస్2 ఇంటిగ్రేటర్స్ సంస్థ ప్రతినిధి శ్రీకాంత్ లింగిడి తెలిపారు.
ఉజ్వల భవిష్యత్తు: మంత్రి శ్రీనివాస్గౌడ్
‘ఒకప్పుడు మహబూబ్నగర్ అంటే తాగు నీటికి కూడా 14 రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. తెలంగాణ ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జిల్లా అన్ని రంగాల్లో రాణిస్తున్నది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఐటీ టవర్ ఏర్పాటయ్యింది. అందులో అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ పరిశ్రమను నెలకొల్పుతుండటం సంతోషకరం’ అని మంత్రి అన్నారు.