ప్రభుత్వానికి నాయీబ్రాహ్మణుల విజ్ఞప్తి
సానుకూలంగా స్పందించిన మంత్రి గంగుల
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): సెలూన్లు, లాండ్రీలు, దోభీఘాట్లకు ఉచితంగా అందించే 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు విధానాన్ని సరళీకరించాలని నాయీ బ్రాహ్మణసంఘం ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆ సంఘం ప్రతినిధులు ఆదివారం హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ను కలిసి వినతి పత్రం అందజేశాయి. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్లో లేబర్, మున్సిపల్, గ్రామపంచాయతీ లైసెన్స్లు, కిరాయి ఒప్పందాలు, మూడునెలల పవర్బిల్లుల అడ్వాన్స్ చెల్లింపుల నుంచి మినహాయించాలని కోరారు. వ్యక్తిగత ధ్రువీకరణతో అనుమతించాలని విన్నవించారు. క్షౌరవృత్తిని సేవావృత్తిగా పరిగణించాలని అన్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులున్న దృష్ట్యా 3 నెలల సర్చార్జీలు చెల్లించే పరిస్థితుల్లో సెలూన్లు లేవని, ఇటువంటి పరిస్థితులను మానవతాదృక్పథంతో ఉత్తర్వులను సవరించాలని విజ్ఞప్తిచేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. నాయీబ్రాహ్మణ సోదరులకు న్యాయం చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసినవారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ నాగరాజు, ప్రధాన కార్యదర్శి కొట్టాల యాదగిరి తదితరులు ఉన్నారు.