హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): ప్రతి ఒక్క ఖాళీ పోస్టును భర్తీ చేసేలా నివేదికలు తయారుచేయాలని మంత్రులు మహమూద్అలీ, శ్రీనివాస్గౌడ్, గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల్లో ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వానికి సమగ్ర సమాచారం అందజేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయాశాఖల అధికారులతో హైదరాబాద్లోని తమ కార్యాలయాల్లో మంత్రులు వేర్వేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులతోపాటు శాఖకు కేటాయించిన పోస్టుల్లోని ఖాళీలపై సమగ్రంగా చర్చించారు. హోంశాఖలోని అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను వెంటనే సిద్ధంచేయాలని హోంమంత్రి మహమూద్అలీ అధికారులను ఆదేశించారు. బోనాలు, బక్రీద్ పండుగలకు విస్తృత బందోబస్త్ ఏర్పాటుచేసి వేడుకలు శాంతియుతంగా జరిగేలా చూడాలని సూచించారు. త్వరలోనే ఉద్యోగ ఖాళీలపై పూర్తి సమాచారాన్ని సీఎం కేసీఆర్కు అందజేస్తామని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. జోనల్ సమస్య పరిష్కారంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం అవుతున్నదని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కొత్త జోనల్ విధానంతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులతో భర్తీ అవుతాయని పేర్కొన్నారు.