న్యూఢిల్లీ, జూన్ 1: వచ్చే జూలై లేదా ఆగస్టు తొలివారం నాటికి రోజుకు సగటున కోటి మందికి కరోనా టీకాలు వేసే దశకు చేరుకుంటామని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. ఆ మేరకు టీకాలు అందుబాటులో ఉంటాయని మంగళవారం తెలిపింది. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ విలేకర్లతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. డిసెంబరుకల్లా దేశంలో అందరికీ వ్యాక్సిన్ వేయటం పూర్తవుతుందన్న ఆశాభావంతో ఉన్నామన్నా రు. ‘ప్రస్తుతం దేశంలో 21.60 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ వేశాం. ఇది దాదాపు అమెరికాలో జరిగిన వ్యాక్సినేషన్తో సమానం. మరోవైపు, అమెరికా జనాభాకన్నా మన జనాభా నాలుగు రెట్లు అధికం’ అని పేర్కొన్నారు.
సైన్స్ తేల్చేంతవరకూ ప్రస్తుత విధానమే..
రెండు వేర్వేరు కంపెనీల కరోనా టీకాలను (ఉదాహరణకు తొలిడోసు కొవిషీల్డ్, రెండో డోసు కొవాగ్జిన్) తీసుకోవటం వల్ల వైరస్కు వ్యతిరేకంగా రోగనిరోధకశక్తి పెరుగుతుందా అనే అంశంపై భారత్ పరీక్షలు నిర్వహించనుందంటూ వచ్చిన వార్తలపై కేంద్రం స్పష్టతనిచ్చింది. ‘వేర్వేరు టీకాలను తీసుకోవటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు అన్నది ఒక వాదన, దీనివల్ల సమస్యలేమీ రాకపోగా, రోగనిరోధకశక్తి మరింత పెరుగుతుందన్నది మరో వాదన. ఈ రెండింటిలో ఏది నిజం అనేది సైన్స్ తేల్చేంతవరకూ వేర్వేరు టీకాలను ఒకేవ్యక్తికి వేయకూడదు అన్న ప్రస్తుత విధానమే కొనసాగుతుంది. తొలిడోసు ఏ టీకా వేసుకుంటే.. రెండోడోసూ ఆ టీకానే తీసుకోవాలి’ అని నీతిఆయోగ్ (ఆరోగ్య విభాగం) సభ్యుడు వీకే పాల్ తెలిపారు.
పాజిటివిటీ రేటు 5శాతం కంటే తక్కువ ఉండాలి
జిల్లాల్లో లాక్డౌన్ నిబంధనల సడలింపుపైనా పాల్ స్పష్టతనిచ్చారు.. ఒక వారంలో నమోదయ్యే పాజిటివిటీ రేటు (మొత్తం కరోనా పరీక్షల్లో పాజిటివ్గా తేలిన కేసులు) 5 శాతం కన్నా తక్కువగా ఉండాలని, వైరస్ సోకే ప్రమాదం ఉన్న జనాభాలో 70 శాతానికిపైగా మందికి టీకాలు వేయటం పూర్తికావాలని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 344 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉందని, వారం రోజులుగా 30 రాష్ట్రాల్లో కొత్త కేసులూ తగ్గుతున్నాయని తెలిపారు.
పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ
ప్రస్తుత కరోనా వ్యాప్తిలో వైరస్ బారిన పడుతున్న పిల్లల సంఖ్య తక్కువేనని, వారిలోనూ దవాఖానలో చికిత్స అవసరమవుతున్న వారి సంఖ్య ఇంకా తక్కువగా ఉంటున్నదని పాల్ తెలిపారు. అయితే వైరస్లో, మహమ్మారి వ్యాప్తిలో వచ్చే మార్పులను బట్టి పిల్లలపై కరోనా ప్రభావం ఎక్కువగా పడే ప్రమాదం లేకపోలేదన్నారు. ఈ నేపథ్యంలోనే, చిన్నారులపై కరోనా కలిగిస్తున్న ప్రభావాన్ని అధ్యయనం చేయటానికి జాతీయస్థాయిలో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటుచేశామని చెప్పారు. ప్రస్తుతం కరోనా బారిన పడిన కొందరు పిల్లల్లో 2-6 వారాల తర్వాత జ్వరం, చర్మంపై ఎర్రగా కావటం, కళ్లలో మంట, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని, ఇది ‘మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్’ అని తెలిపారు. ఇది క్లిష్టమైన సమస్య కాదుగానీ.. సకాలంలో చికిత్స తీసుకోవాలని సూచించారు.