Human rights | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ప్రజాస్వామ్యయుతంగా హక్కుల కోసం పోరాడే కార్యకర్తలను హింసాత్మకంగా అణచివేయడంలో రెండో స్థానంలో ఉంది. ఇటీవల బ్రిటన్కు చెందిన బిజినెస్ అండ్ హ్యూమన్ రైట్స్ రిసోర్స్ సెంటర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మానవ హక్కుల రక్షకులపై హింసాత్మక దాడులు జరిగిన దేశాలలో బ్రెజిల్ అగ్రభాగాన ఉండగా, భారత్ రెండో స్ధానంలో ఉంది. 2022లో ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల కార్యకర్తలపై 550 హింసాత్మక దాడులు జరిగితే అందులో బ్రెజిల్లో 63, భారత్లో 54 దాడులు జరిగాయి.
పర్యావరణ పరిరక్షణకై పోరాడినందుకు
ప్రపంచ వ్యాప్తంగా జరిగిన 550 దాడుల్లో 75 శాతం భూమి, పర్యావరణ పరిరక్షణ పోరాట కార్యకర్తలపై జరిగాయని బిజినెస్ ఆండ్ హ్యూమన్ రైట్స్ రిసోర్స్ సెంటర్ నివేదిక పేర్కొన్నది. ఉక్కు, బొగ్గు కంపెనీలకు సంబంధం భారత్లోని అగ్రశ్రేణి ఉక్కు, బొగ్గు సంస్ధలకు ఈ దాడులతో సంబంధం ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నది. తూర్పు ఒడిశాలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్కు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని, పోలీసులు అణచివేసిన తీరును ప్రస్తావించింది.
ఉక్కు కర్మాగారం నిర్మించాలని ఆ కంపెనీ 2018 నుంచి ప్రయత్నాలు చేస్తుండగా ప్రజలు భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ స్థాపనకు వ్యతిరేకంగా ప్రజలు పలుమార్లు నిరసన తెలపగా పోలీసులు దాదాపు వెయ్యి మందిని అరెస్టు చేశారని, ఆందోళనకారుల పట్ల హింసాత్మకంగా ప్రవర్తించారని ఈ నివేదిక పేర్కొన్నది. మరో కంపెనీ టోటల్ ఎనర్జీస్ కూడా మానవ హక్కుల కార్యకర్తల పట్ల హింసాత్మకంగా ప్రవర్తించిందని తెలిపింది.