కాళేశ్వరం, మార్చి 1 : మేడిగడ్డ ప్రాజెక్టు రాష్ర్టానికి శరణ్యమని, ఇంజినీర్లు ఎంతో శ్రమించి డిజైన్ చేసి నిర్మించారని నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఎస్ఈ వెంకటేశం అన్నారు. ప్రాజెక్టు వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందిందంటే అందులో ఇంజినీర్లది క్రియాశీలక పాత్ర ఉంటుందన్నారు. సమైక్య పాలనలో జరిగిన నీటి దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నామని, మన రాష్ట్రంలో ఉన్న నీటిని మనమే వినియోగించుకోవాలని కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్టు పేర్కొన్నారు. గోదావరిలో సంవత్సరంలో 950 టీఎంసీల నీరుంటుందని, ప్రాణహిత నదికి పైన ఉన్న నదులతో కలిపి మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఉంటుందని సీడబ్ల్యూసీ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ బరాజ్లో 87 పిల్లర్లుండగా కేవలం మూడు మాత్రమే కుంగాయని, ఇది పెద్దదేం కాదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆలస్యం చేయకుండా మరమ్మతు పనులను పూర్తి చేయాలని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో కమిటీ వేసి, నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు.