హైదరాబాద్ సిటీబ్యూరో, మే 14 (నమస్తే తెలంగాణ): ఖానామెట్లోని భూములను కబ్జాచేసి నిర్మించిన కట్టడాల కూల్చివేతలను రెవెన్యూ అధికారులు గురువారం చేపట్టారు. కబ్జాదారులు సర్వే నంబర్ 41/11లో వేసిన రేకుల ఫెన్సింగ్ను జేసీబీలతో నేలమట్టం చేశారు. ఆ పక్కనే మరో భూమిలో వేసిన ఫెన్సింగ్ను తొలగించారు. మరోవైపు ఇంటెలిజెన్స్ అధికారులూ అక్కడికి చేరుకుని భూ యజమానుల నుంచి వివరాలు సేకరించారు. బాధితులు ఫిర్యాదు చేసినా మాదాపూర్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇంటెలిజెన్స్ అధికారులు దానిపై ఆరా తీసినట్టు సమాచారం. అధికారుల ప్రవేశంతో కబ్జాలు నిజమేనని ధ్రువీకరణ అయ్యింది. సర్వే నంబర్ 41/11లోని 1400 గజాలతోపాటు పక్కనే ఉన్న మరికొంత భూమిలో కబ్జాదారులు ఫెన్సింగ్ వేశారు.
రెవెన్యూ అధికారులు కబ్జాలను తొలగించినా బౌన్సర్లు మాత్రం అక్కడి నుంచి కదల లేదు. కబ్జాదారులకు సంబంధించిన బౌన్సర్లు అక్కడే ఉండి ఎవరినీ రాకుండా అడ్డుకుంటున్నారు. మీడియా ప్రతినిధులను సైతం వారు అడ్డుకున్నారు. దీనిపై మాదాపూర్ పోలీసులను సంప్రదించగా రెవెన్యూ అధికారులను అడగాలని చెప్తున్నారు.