హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): మునుగోడులో ఓటమి కండ్ల ముందు కనిపిస్తుండటంతో బీజేపీ ‘ట్రంప్ కార్డ్’ డ్రామా మొదలుపెట్టింది. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి జ్వరంతో బాధపడుతున్నట్టు మంగళవారం ప్రకటించారు. తాను చెకప్ చేసుకొంటున్న ఫొటోలను సైతం విడుదల చేశారు. ప్రతి ఎన్నికల సమయంలో సానుభూతి కోసం ‘అనారోగ్య’ నాటకాలు ఆడటం బీజేపీకి పరిపాటి అయ్యిందని విశ్లేషకులంటున్నారు. 2019 కరీంనగర్ లోక్సభ ఎన్నికల సమయంలో బండి సంజయ్ ‘వడదెబ్బ’ పేరుతో దవాఖానలో చేరారు. 2020లో దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్రావు చెయ్యి విరిగిందంటూ పట్టీతో ప్రచారంచేశారు. 2021లో ఈటల రాజేందర్ పాదయాత్రలో అస్వస్థతకు గురయ్యానంటూ దవాఖానలో చేరారు. సింపతీ కోసం నేతలు పరామర్శలు చేశారు. ఇప్పుడు మునుగోడులోనూ ఇదే మొదలయింది. రాజగోపాల్కు జ్వరం వచ్చిందంటూ ప్రకటన ఇచ్చారు.
ముందే హెచ్చరించిన మంత్రులు..
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం ఖాయమని, కాంగ్రెస్ రెండో స్థానానికి, బీజేపీ మూడో స్థానానికి పరిమితం అవుతాయని టీఆర్ఎస్ నేతలు ముందు నుంచీ చెప్తున్నారు. బీజేపీ మొదట్లో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా.. రానురాను పరిస్థితి అర్థమైంది. ఈ నేపథ్యంలో సానుభూతి ఓట్ల కోసం ఒకట్రెండు రోజుల్లో ‘పట్టీ డ్రామా’ మొదలవుతుందని మంత్రులు కేటీఆర్, హరీశ్రావు ఇటీవలే పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వాళ్లన్నమాటలే ఇప్పుడు నిజమయ్యాయి. రాజగోపాల్రెడ్డి తనకు జ్వరం వచ్చిందంటూ ఫొటోలు బయటకు లీక్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో రాజగోపాల్రెడ్డిపై రకరకాల వ్యంగ్యాస్ర్తాలు మొదలయ్యాయి. కొందరు నెటిజన్లు బండి సంజయ్, రఘునందన్, ఈటల రాజేందర్, రాజగోపాల్రెడ్డి ఫొటోలతో ఉన్న వీడియోలను.. పాటలతో జత చేసి పెట్టారు. తాము రాజగోపాల్రెడ్డి నాటకం గురించి ముందే చెప్పామంటూ పలువురు నెటిజన్లు గతంలో తాము చేసిన సోషల్ మీడియా పోస్టులను తిరిగి పోస్ట్ చేశారు. రాజగోపాల్రెడ్డి మునుగోడు డ్రామా అంటూ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా మీమ్స్ కూడా తయారు చేసి వదులుతున్నారు.
రాజగోపాల్రెడ్డి త్వరలో కొత్త డ్రామా మొదలు పెట్టబోతున్నారని ఈ నెల 23న నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ ముందే చెప్పిన మాట ఇదీ.
బీజేపీ పట్టీ డ్రామాలు..
2019 ఏప్రిల్ 9:సార్వత్రిక ఎన్నికల్లో కరీంగనగర్ లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఉన్న బండి సంజ య్ విజయ సంకల్పయాత్ర పేరుతో ర్యాలీ చేపట్టారు. కరీంనగర్లోని టవర్ సర్కిల్ దగ్గరికి రాగానే ‘అస్వస్థత’ డ్రామా మొదలైంది. సమీపంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా ‘స్వల్ప వడదెబ్బ’ తగిలిందన్నారు. దీం తో.. సీన్ క్రియేట్ చేసేందుకు నేతలు ఆయ న్ను కార్పొరేట్ దవాఖానకు తరలించారు.
2021 జూలై 31: హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరం ఈటల రాజేందర్ పాదయాత్ర మొదలుపెట్టారు. ప్రజలు పట్టించుకోకపోవడంతో ‘అస్వస్థత’ అంటూ కార్పొరేట్ హాస్పిటల్లో చేరారు. అయినా సింపతీ దక్కకపోవడంతో బీజేపీ నేతలంతా క్యూ కట్టి మరీ పరామర్శలకు వెళ్లారు.
2020 అక్టోబర్ 27: దుబ్బాక ఉప ఎన్నికల్లో అక్రమంగా గెలిచేందుకు రఘునందన్రావు సిద్దిపేటలోని తన బంధువుల ఇంటిలో డబ్బు నిల్వ చేసినట్టు పోలీసులకు సమాచారం అందింది. విచారించే క్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు హైడ్రామా చేశారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ కొట్లాట సమయంలో తన చేతికి ఫ్రాక్చర్ అయ్యిందంటూ రఘునందన్రావు డ్రామా మొదలు పెట్టారు.
2022 అక్టోబర్ 25: మునుగోడులో బీజేపీ పరిస్థితి రోజురోజుకూ దారుణంగా తయారవుతున్నది. రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసమే రాజగోపాల్రెడ్డి రాజీనామా చేసి, పార్టీ మారారని ప్రజలకు అర్థమైంది. దీంతో మూడో స్థానం తప్పేలా లేదు. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు ‘ట్రంప్ కార్డ్’ డ్రామాకు తెరలేపారు. జ్వరం వచ్చిందంటూ బెడ్పై పడుకొని చికిత్స పొందుతున్న ఫొటోలు విడుదల చేశారు.